కేంద్రం కీలక నిర్ణయం: విద్యామంత్రిత్వ శాఖగా మారిన హెచ్ఆర్డీ, నిపుణుల కమిటీ సిఫారసుకు క్యాబినెట్ ఓకే
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మానవ వనరుల అభివృద్ది శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మార్చింది. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. నూతన విద్యా విధానంలో ఇదీ కీలక మార్పుగా చెప్పొచ్చు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి విద్యా మంత్రిత్వశాఖగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నది.
ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. హెచ్ఆర్డీ పేరును మార్చాలని సిఫారసు చేసింది. దీనికి కేంద్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఫారసుకు ఆమోదం తెలపడంతో హెచ్ఆర్డీ శాఖ విద్యామంత్రిత్వ శాఖగా మారిపోయింది.
విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్ఆర్డీను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని కమిటీ కేంద్రానికి సూచించగా.. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా రమేష్ పొఖ్రియాల్ నిషాంగ్ ఉన్నారు.