బీజేపీ మాజీ సీఎం ఎన్నికల ఫలితాలు పెండింగ్, ప్రకటించని ఎన్నికల కమిషన్ అదే సమస్య!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన భారత ఎన్నికల కమిషన్ ఒక్క నియోజక వర్గం ఫలితాలు మాత్రం మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ప్రకటించలేదు. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ పోటీ చేశారు.
ఇప్పటి వరకూ బీజేపీ 103 స్థానాల్లో విజయం సాధించిందని భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించలేదు. ఈవీఎంలు, వీవీప్యాట్ మొరాయించడంతో ఓట్లు లెక్కింపు ఇంకా పూర్తికాలేదు. ఇంకా 207 ఓట్ల లెక్కింపు పూర్తికావలసి ఉంది.
ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని భారత ఎన్నికల కమిషన్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు ప్రకారం జగదీష్ శెట్టర్ తన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మహేష్ మీద 21,762 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్లారు.
2013 శాసన సభ ఎన్నికల్లో జగదీష్ శెట్టర్ 17,754 మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత అధికారికంగా జగదీష్ శెట్టర్ విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ లను నిపుణులు పరిశీలించి త్వరగా ఓట్ల లెక్కింపు పూర్తి చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఎన్నికల అధికారుల లెక్కల ప్రకారం బీజేపీ 103 సీట్లలో విజయం సాధించింది.