అది రాఫెల్ డీల్ కాదు..కేవలం కౌగిలింత మాత్రమే: బీజేపీకి సిద్ధు చురకలు
చండీఘడ్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆహ్వానం మేరకు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మాజీ క్రికెటర్ పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ... అక్కడి పాక్ ఆర్మీ చీఫ్ను కౌగలించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిద్ధూ అటు విపక్ష పార్టీల నుంచే కాక సొంత పార్టీ నేతలనుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా సిద్దూ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ వస్తూనే ఉన్నారు. తాజాగా సిద్దూ హగ్ డిప్లమసీపై కామెంట్ చేసిన కమలనాథులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సిద్ధూ. అది కేవలం కౌగలింతే అని అది రాద్దాంతం చేసేందుకు రాఫెల్ డీల్ కాదని సిద్ధూ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే రాఫెల్ డీల్పై బీజేపీని ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ వారికి నిద్రపట్టకుండా చేస్తోంది కాంగ్రెస్.
సిద్ధూ హగ్ ఫలితం: పాక్ గురుద్వారాలోకి భారతీయులకు అనుమతి
సిద్ధూ పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ను కౌగలించుకున్న ఘటన భారత జవాన్లను కుంగదీసిందని రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. దీనికి కౌంటర్గా సిద్ధూ మాట్లాడారు. మర్చిపోయిన ఘటనను మళ్లీ తవ్వి తీస్తున్నారని మండిపడ్డారు. సిద్దూ అనే వ్యక్తి చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా చేస్తున్నారని అందుకు నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం కౌగలింత మాత్రమేనని, కుట్రకాదని అన్నారు. కౌగలింత అంటే రాఫెల్ డీల్ కాదని చెబుతూనే గురుసిక్కులపై బుల్లెట్ వర్షం కురిపించడం కాదని సిద్ధూ కౌంటర్ ఇచ్చారు. సిక్కుల మనోభావాలకు సంబంధించి మాట్లాడని బీజేపీ... అక్కడ కౌగిలింత గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.
భారత్ పాకిస్తాన్ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్లో ఆటగాళ్లు కరచాలనం చేసుకోరా అంటూ ప్రశ్నించారు సిద్దు. ఒక మాజీ క్రికెటర్గా పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ భారత ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు వస్తే షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని ఆటగాళ్లకు చెప్పే ధైర్యం బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. పాక్లో స్థిరపడ్డ భారత సిక్కుల కోసం కర్తార్పూర్ గురుద్వారా త్వరలో తెరుచుకుంటుందని పాక్ ఆర్మీ ఛీఫ్ బాజ్వా చెప్పగానే తాను ఆయన్ను కౌగలించుకున్నట్లు సిద్ధూ మరోసారి స్పష్టం చేశారు.
ఈ మంచి పనిలో భాగస్వాములు అవ్వాలని అంతే తప్ప అడ్డంకులు సృష్టించొద్దని బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాళీదల్కు సూచించారు. కేంద్రం నుంచి ఒక లేఖ తీసుకొస్తే పాకిస్తాన్లోని సిక్కులకు మేలు చేకూరుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు సిద్ధూ. ఇప్పటికే పాక్ ఈ అంశంపై సానుకూలంగా ఉందని వెల్లడించారు. శిరోమణి అకాళీదల్ నేత సుఖ్భీర్సింగ్ బాదల్ సిద్ధూను ఓ కుట్రదారుడిగా అభివర్ణించిన నేపథ్యంలో సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు.