ప్రాణం కంటే లిక్కర్ కిక్కుకే విలువ: కరోనా ఉందని తెలిసినా..కరవు తీరేలా: లాఠీ ఛార్జీ చేస్తే గానీ..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడోదశ లాక్డౌన్ అమల్లోకి వచ్చిన వేళ.. మందుబాబులు పోటెత్తారు. మద్యం షాపుల ముందు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి నిల్చున్నారు. దేశవ్యాప్తంగా సడలింపులు ఇచ్చిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మందుబాబుల తాకిడి తీవ్రం కావడం వల్ల చాలా చోట్ల పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. అసాధారణ స్థాయిలో మద్యం షాపుల వద్ద రద్దీ నెలకొంది. గుంపులుగా గుంపులుగా నిల్చున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కనీస ముందు జాగ్రత్తలను కూడా తీసుకోలేదంటే.. ప్రాణం కంటే లిక్కర్ కిక్కుకే ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఏపీ సహా సడలింపునిచ్చిన రాష్ట్రాల్లో
మూడోదశ లాక్డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ఇచ్చింది. సోమవారం మూడోదశతో పాటు ఈ సడలింపులు కూడా అమల్లోకి వచ్చాయి. గ్రీన్జోన్లు, నాన్ కంటైన్మెంట్ క్లస్టర్లలో మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి ఇచ్చింది. ఆంక్షలతో కూడిన సడలింపులను ఇచ్చింది. మద్యం షాపుల ముందు జనం గుమికూడదని, కొనుగోలుదారులు అయిదుమందికి మించకూడదని, ముగ్గుల్లోనే నిల్చోవాలనీ సూచించింది. తాము సూచించిన నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించని మద్యం దుకాణాలను మూసివేస్తామనీ హెచ్చరించింది.
తలకెక్కించుకోని మందుబాబులు..
ఇలాంటివెన్నో నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ.. మందుబాబులు వాటిని తలకెక్కించుకోలేదు. మద్యం చుక్క దొరుకుతుందనే ఆశతో కరోనా వైరస్ ఒకటి ఉందనే విషయాన్ని కూడా విస్మరించినట్లు ప్రవర్తించారు. ఫలితంగా- దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరారు. పోలీసులు వారించినా వినిపించుకోలేదు. వారిని నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. దీనితో చాలా చోట్ల మందుబాబులపై లాఠీ ఛార్జీని చేయాల్సి వచ్చింది పోలీసులకు.
తన్నులాట..తోపులాట
కాగా, చాలా చోట్ల మందుబాబుల మధ్య కూడా గొడవలు చెలరేగాయి. ఘర్షణ పడ్డారు. తాను ముందు అంటే తాను ముందు అంటూ ఒకరినొకరు తోసుకున్నారు. తన్నులాడుకున్నారు. చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాల వల్ల తోపులాట చోటు చేేసుకుంది. 40 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరచుకోవడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు..మళ్లీ ఎక్కడ మద్యం దుకాణాలను మూసి వేస్తారోననే ఆందోళన చెందేలా పోటెత్తారు. చాలామంది భారీగా మద్యాన్ని కొనుగోలు చేయడం కనిపించింది. సాయంత్రం 7 గంటల వరకు గడువు ఉన్నప్పటికీ.. పట్టించుకోలేదు. న్యూడిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద మందుబాబుల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
Recommended Video
నిబంధనలు గాలికి..
కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు గాలికి కొట్టుకుని పోయినట్టు కనిపిస్తోందాయా ప్రాంతాల్లో. కొనుగోలుదారుల తాకిడి అధికంగా ఉంటుందని భావించే ప్రాంతాలు, దుకాణాల వద్ద బ్యారికేడ్లను కట్టారు. కొనుగోలుదారులను నియంత్రించడానికి, సోషల్ డిస్టెన్సింగ్ను పర్యవేక్షించే బాధ్యతను స్థానిక మున్సిపల్ సిబ్బంది, పోలీసులకు అప్పగించారు. కొనుగోలుదారుల తాకిడి తీవ్రంగా ఉండటం, సోషల్ డిస్టెన్సింగ్ను పాటించని దుకాణాలను మూసివేసే అధికారాలను స్థానిక సంస్థల అధికారులకు ఇచ్చారు. మూడోదశ లాక్డౌన్ ముగిసేంత వరకూ మద్యం దుకాణాలను తెరనివ్వకూడదంటూ ఆదేశాలను జారీ చేశారు.