తప్పు ఎవరు చేసినా తప్పే..! బ్రిటీష్ ఎయిర్ వేస్కు ఫైన్ ..!!
లండన్/హైదరాబాద్ : తప్పు ఎక్కడ ఏ రూపంలో చేసినా తప్పే. నియమాలకు ఏదీ అతీతం కాదని బ్రిటిష్ ఎయిర్ లైన్స్ రుజువు చేసింది. బ్రిటీష్ ఎయిర్లైన్స్(బీఏ) సంస్థకు భారీ మొత్తంలో జరిమానా పడినట్లు ఆ కంపెనీ మాతృసంస్థ ఐఏజీ(ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ గ్రూప్) పేర్కొంది. సదరు సంస్థ నుంచి ప్రయాణికుల సమాచారం తస్కరణకు గురవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి యూకే సమాచారశాఖ కమిషనర్ నుంచి యూకే సమాచార భద్రత చట్టం కింద తాఖీదులు రానునట్లు ఐఏజీ తెలిపింది.
జరిమానా కింద మొత్తం 229.7 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇది బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థ 2017 ఆర్థిక సంవత్సర టర్నోవర్లో 1.5 శాతం ఉంటుందని వెల్లడించింది.ఇదిలా ఉండగా ఐఏజీ ప్రదాన అధికారి విల్లీ వాల్ష్ మాట్లాడుతూ..ఈ జరిమానా తగ్గించాల్సిందిగా కోరుతూ తమ వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. సమాచారం తస్కరణకు గురైందనే విషయం తెలియగానే పరిరక్షణ చర్యలు చేపట్టినట్టుగా ఆయన వెల్లడించారు.
దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లభించకపోయినా వార్తా పత్రికలలో సదరు విషయాన్ని తెలిపి ప్రయాణికులందరికీ క్షమాపణలు చెప్పామన్నారు. ఈ తస్కకరణకు గురైన సమాచారంలో వినియోగదారుల పేర్లు, చిరునామా, ఈ-మెయిల్ అడ్రస్లు, క్రెడిట్ కార్డు సమాచారం ఉంది. దీని బారిన పడిన ప్రయాణికులందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని బీఏ సీఈఓ అలెక్స్ క్రూజ్ పేర్కొన్నారు. ఐఏజీ కంపెనీలో బ్రిటీష్ ఎయిర్వేస్తో పాటు మరో నాలుగు ఎయిర్లైన్ సంస్థలు ఉన్నాయి.