ప్లాన్ లేకుండా ఐదు గంటల్లో భారీ మసీదు కూల్చగలరా ? అప్పటి హోం కార్యదర్శి ప్రశ్న
1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇవాళ లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై విపక్షాలతో పాటు ముస్లిం సంఘాలు ప్రతికూలంగా స్పందించగా.. గతంలో ఆ ఘటన జరిగినప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న మాధవ్ గోడ్బొలే చేసిన తాజా వ్యాఖ్యలు సీబీఐ కోర్టు తీర్పుపై కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి.
బాబ్రీ తీర్పుపై అప్పీలుకు ముస్లిం సంఘాల నిర్ణయం-త్వరలో హైకోర్టులో పిటిషన్
అప్పట్లో ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న మాధవ్ గోడ్బొలే బాబ్రీ కూల్చివేత కేసులో ఇవాళ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీతో పాటు ఇతరులను విముక్తుల్ని చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ కేసు కొట్టేయడానికి ప్రధాన కారణంగా బాబ్రీ మసీదు కూల్చివేత కోసం ముందస్తు వ్యూహం ఏదీ జరగలేదంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను గోడ్బొలే తప్పుబట్టారు. ఎలాంటి ముందస్తు వ్యూహం లేకుండా కేవలం ఐదు గంటల్లో భారీ మసీదు ఎలా కూలుతుందని ఆయన ప్రశ్నించారు.
సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మన న్యాయవ్యవస్ధ ఇచ్చే తీర్పులపై, క్రిమినల్ న్యాయ వ్యవస్ధపై చర్చకు తావిచ్చేలా ఉందన్నారు. అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలోనే అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు ఒక్కసారిగా దూసుకొచ్చి కూల్చివేశారు. ఇందులో బీజేపీ అగ్రనేతలతో పాటు శివసేన వంటి పార్టీల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యూపీలోని కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ వల్లే తాము ఇందులో జోక్యం చేసుకోలేదని చెప్పుకొచ్చింది.