గ్రౌండ్ రిపోర్ట్: సరయూ నదిలో పవిత్రస్నానం..రామ్ లల్లా దర్శనం: అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
లక్నో: అయోధ్య. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న ఒకే ఒక్క పేరు. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలవరించిన అనంతరం.. శ్రీరామచంద్రుడు జన్మించిన ఆ ప్రదేశానికి పోటెత్తుతున్నారు భక్తులు. రామాయణంలోనూ ప్రస్తావించినట్లుగా చెబుతోన్న పరమ పవిత్రమైన సరయూనదిలో భక్తులు పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. రామ్ లల్లాను దర్శిస్తున్నారు. సాధారణ రోజులతో పోల్చుకుంటే- తీర్పు వెలువడిన మరుసటి రోజే భక్తులు రద్దీ అసాధారణంగా ఉంటోంది.
శ్రీరామ నామాన్ని జపిస్తూ..
ఉత్తర్ ప్రదేశ్ సహా బిహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు. ఈ తెల్లవారు జాము నుంచే భక్తుల రద్దీ అయోధ్యలో నెలకొంది. వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రైవేటు క్యాబ్ లు, ఆటోల ద్వారా పెద్ద సంఖ్యలో అయోధ్యను చేరుకున్నారు. వారిలో సాధువులు అధికంగా ఉండటం గమనార్హం. కాషాయ దుస్తులు ధరించి.. జై శ్రీరామ్ అని నినాదాన్ని జపిస్తూ గుంపులు, గుంపులుగా చేరుకుంటుండటంతో ఆ చారిత్రాక పట్టణంలో ఓ సరికొత్త ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తొలిసారిగా వచ్చిన వారే..
అయోధ్యకు వస్తోన్న భక్తుల్లో కొత్త వారు అధికంగా ఉన్నారని స్థానిక చిరు వ్యాపారులు, దుకాణదారులు చెబుతున్నారు. అయోధ్యను సందర్శించడానికి వచ్చిన వారిలో చాలామంది.. ఫలానా ప్రదేశం, ఫలానా ఆలయం ఎక్కడ ఉందంటూ ఆరా తీస్తున్నారని, తాము తొలిసారిగా అయోధ్యకు వచ్చామని చెబుతున్నారని స్థానిక వ్యాపారులు వెల్లడిస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం సందర్శకుల సంఖ్యపై చెప్పుకోదగ్గ స్థాయిలో సానుకూలంగా పడిందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రద్దీ ఇక ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు.
సరయూ నదీ తీరంలో సందడి..
రామాయణ కాలం నుంచీ ఉన్నట్టుగా భావిస్తోన్న సరమూ నదీ తీరంలో సందడి నెలకొంది. అయోధ్యకు వచ్చిన భక్తుల్లో 90 శాతం మంది సరయూనదిలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. తొలిసారిగా తాము ఈ నదిలో స్నానం చేస్తున్నామనే ఆనందాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సరయూ నది ఒడ్డున నిర్మించిన ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. పవిత్ర స్నానాల సందర్భంగా తోపులాటలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. ప్రతి ఘాట్ వద్ద కూడా కానిస్టేబుళ్లను మోహరింపజేశారు. వారు భక్తులను క్రమబద్దీకరిస్తున్నారు.
రామ్ లల్లా దర్శనం..
రామజన్మభూమిలో ప్రతిష్ఠించిన రామ్ లల్లా, సీతామాత విగ్రహాలను దర్శించుకుంటున్నారు. చాలాసేపు అక్కడే గడపడానికి ఇష్టపడుతున్నప్పటికీ.. భద్రతా బలగాలు వారిని ఎక్కువ సేపు ఉండనివ్వట్లేదు. జైశ్రీరామ్ నినదాలతో రామ్ లల్లా ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న హనుమాన్ గర్చి ఆలయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. రామ్ లల్లా దర్శనం అనంతరం భక్తులు హనుమాన్ గర్చి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. పూజలను నిర్వహించడానికి హనుమాన్ గర్చి ఆలయంలో ఆంక్షలు లేవు. దీనితో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు.
భద్రతా చర్యలు కొనసాగింపు..
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. అయోధ్యలో చేపట్టిన భద్రతా చర్యలు సోమవారం సాయంత్రం వరకూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే ప్రత్యేక సాయుధ బలగాలను వెనక్కి తీసుకోవచ్చని అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడటానికి ముందు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టారో.. తీర్పు తరువాత కూడా అవే కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ, వాహనాల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కొన్ని చోట్ల బ్యారికేడ్లను తొలగించారు. అలాంటి చోట భద్రతా బలగాలు భక్తులను తనిఖీ చేసిన తరువాతే అనుమతి ఇస్తున్నారు.