పోయెస్ గార్డెన్కు దీప, దీపక్! ఏం జరగబోతుంది?, భారీగా మోహరించిన పోలీసులు
దివంగత సీఎం జయలలిత మేనల్లుడు దీపక్, మేన కోడలు దీప పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం వద్దకు వస్తున్నారన్న వార్తలు వెల్లువెత్తడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఆమె రాజకీయ వారసులం మేమంటే మేమంటూ పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయాల సంగతెలా ఉన్నా.. ఆమె ఆస్తులు ఎవరికి దక్కుతాయన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
సీఎంగా ఉన్న సమయంలో జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ ను స్మారక కేంద్రంగా మారుస్తానని పన్నీర్ సెల్వం ప్రకటించగా.. ప్రస్తుతం పోయెస్ గార్డెన్ శశికళ బంధువర్గమైన మన్నార్ గుడి మాఫియా చేతుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
జయ మరణం తర్వాత అనూహ్యంగా బలం పుంజుకుంటూ వస్తున్న ఆమె మేనకోడలు దీప జయకుమార్, మేనత్త ఆస్తులు తమకే దక్కుతాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. జయ మేనల్లుడు దీపక్ సైతం అన్నాడీఎంకెలో శశికళ నాయకత్వానికి మద్దతు ప్రకటించినా.. ఆస్తుల విషయం వచ్చేసరికి మాత్రం మాట మార్చేశాడు.
జయలలిత ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లోను తమకే చెందాలని దీపక్ గత నెల 23న స్పష్టం చేశారు. ఇప్పటిదాకా మాటలకే పరిమితమైన దీప, దీపక్.. ఇప్పుడు నేరుగా పోయెస్ గార్డెన్ ను స్వాధీనం చేసుకోవడానికి రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం వద్దకు వస్తున్నారన్న వార్తలు వెల్లువెత్తడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
భారీ సంఖ్యలో పోలీసులు ప్రస్తుతం పోయెస్ గార్డెన్ వద్ద మోహరించారు. వేదనిలయం లోపల, బయట మొత్తం పోలీసులే కనిపిస్తున్నారు. అయితే దీప, దీపక్ అక్కడకు వస్తున్నట్లు తమకెటువంటి సమాచారం లేదని, ఓ లాయర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడంతో భారీ భద్రతను మోహరించాల్సి వచ్చిందని ఓ పోలీస్ అధికారి చెప్పినట్లు సమాచారం.