అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు ఆమోదించం! భారత్ కు స్పష్టం చేసిన ట్రంప్..!!
వాషింగ్టన్/హైదరాబాద్: నిన్నటి వరకూ బ్రిటన్, ఉత్తర కొరియా, ఇరాన్ పై విరుచుకుపడ్డ అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్ ను టార్గెట్ చేసారు. అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తూ భారత్ చాలా కాలంపాటు లాభాలను ఆర్జించిందని, ఈ నేపథ్యంలో అమెరికా పేరు చెప్పి భారత్ 'పండగ' చేసుకుందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ఇలాంటి విధానాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని నిష్కర్షగా పేర్కొంటూ ట్వీట్ చేశారు.
జూన్ 28న భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒసాకాలో కలుసుకుని ద్వైపాక్షిక వాణిజ్య వివాదాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్న విషయం గమనార్హం. అమెరికా ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తోందంటూ ఆయన గతంలో కూడా తీవ్రంగా విమర్శిస్తూ, భారత్ను 'సుంకాల రాజు' గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. 'బ్రెక్సిట్' నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాని థెరిసా మే పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ తాజాగా నిప్పులు చెరిగారు.
ఐరోపా యూనియన్తో 'బ్రెక్సిట్' చర్చల విషయంలో బ్రిటిష్ ప్రధాని థెరిసా మే అంతులేని గందరగోళాన్ని సృష్టించారంటూ ట్రంప్ విరుచుకుపడ్డారు. పదవి నుంచి ఆమె త్వరలోనే వైదొలగనుండటం ఓ రకంగా శుభవార్త అంటూ ఆమెపై ట్విటర్లో విమర్శల వర్షమే కురిపించారు ట్రంప్. పర్యావరణానికి సంబంధించి ఒబామా సర్కారు గతంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలను ట్రంప్ ఖండించారు.
బ్రిటన్ అమెరికా మద్య చేసుకున్న పరస్పర ఒప్పందాలను నిష్ప్రయోజనకరమైన ఒప్పందాలుగా అభివర్ణించారు. వాటి మూలంగా ప్రపంచంలోనే అత్యంత విపరీత కాలుష్యానికి కారణమౌతున్న దేశాలు కొన్ని నేటికీ పాత పద్ధతులనే పాటిస్తున్నాయంటూ విమర్శించారు. వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమన్న అభిప్రాయాన్ని అమెరికా ఎప్పటి నుంచో వ్యక్తం చేస్తున్న విషయం గమనార్హం.