ఆలిండియా ప్రీమెడికల్ ప్రవేశ పరీక్ష రద్దు చేసిన సుప్రీం
ఢిల్లీ: ఆలిండియా ప్రీ మెడికల్ ప్రవేశ పరీక్ష -2015ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పేపర్ లీక్ కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పరీక్ష ఫలితాలు రద్దు చేస్తే అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టులో సీబీఎస్ఈ వాదించినా ఫలితం లేకుండా పోయింది.
సీబీఎస్ఈ వాదనలు పక్కన బెట్టిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లో తిరిగి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. కాగా, ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన 2000 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందనున్నారు.
పేపర్ లీక్ కేసులో 44 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు కోర్టుకు దర్యాప్తు బృందం నివేదిక సమర్పించింది. పరీక్ష మళ్లీ నిర్వహించడం వల్ల దేశవ్యాప్తంగా 1050 సెంటర్లలో పరీక్ష రాసిన 6.5 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని సీబీఎస్ఈ వాదించింది.
సీబీఎస్ఈ వాదనలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కష్టపడి చదివే విద్యార్థులకు మీరు ఏం సందేశం పంపాలనుకుంటున్నారని ప్రశ్నించింది. రాత్రికి రాత్రే అక్రమాల ద్వారా ర్యాంక్ కోల్పోతే.. చదివి పరీక్ష రాసిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని నిలదీసింది.