తెగిన చెరువు కట్ట..బెంగళూరు వీధుల్లో పోటెత్తిన నీరు: 200లకు పైగా నివాసాలు ఖాళీ
బెంగళూరు: సెలవురోజు సరదాగా గడుపుతున్న ఆ కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనలకు గురయ్యారు. ఉరుము లేని పిడుగులాగా ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెంగళూరులోని హులిమావు, బీటీఎం లేఅవుట్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటన ఇది. ఉద్యాననగరిగా పేరున్న బెంగళూరులోని అతి పెద్ద చెరువుల్లో ఒకటైన హులిమావు కట్ట తెగింది.
పోటెత్తిన వీధులు..
కొద్దిరోజుల కిందట కురిసిన భారీ వర్షాలతో నిండుగా ఉన్న హులిమావు చెరువు కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో.. నీళ్లన్నీ వీధుల్లోకి పోటెత్తాయి. జనవాసాలను ముంచెత్తాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు హులిమావు చెరువు వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ (ఎన్డీఆర్ఎఫ్) బలగాలను మోహరింపజేశారు.
140 ఎకరాల్లో విస్తరించిన చెరువు..
బెంగళూరులో సుమారు 140 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ హులిమావు చెరువు. కొద్దిరోజుల కిందట బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు జలకళను సంతరించుకుంది. వర్షాల ధాటికి చెరువు మొత్తం నిండిపోయింది. ఇలాంటి స్థితిలో చెరువులో పూడిక తీత పనులకు దిగారు బీబీఎంపీ అధికారులు. ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక యంత్రాలను తరలించారు. వాటిని చెరువులో దింపి పూడిక తీత పనులను ఆరంభించారు.
పూడికతీత పనుల వల్లేనా?
మూడు రోజుల పాటు పూడిక తీత పనులను వారు కొనసాగించాల్సి ఉంది. పనులను మొదలు పెట్టిన తొలి రోజు సాయంత్రానికి హులిమావు చెరువు కట్ట తెగింది. చెరువు నీళ్లు వీధుల్లో పోటెత్తాయి. పల్లపు ప్రాంతాలను ముంచేశాయి. సుమారు 200 పైగా నివాసాలు జలమయం అయ్యాయి. చెరువు సమీపంలోనే ఉన్న ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం, ప్రభుత్వ పాఠశాల భవన సముదాయంలోకి నీళ్లు ప్రవేశించాయి. హులిమావు, శాంతినికేతన్, కృష్ణానగర, బీటీఎం లేఅవుట్ లోని అనేక పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పరిశీలించిన కమిషనర్లు..
చెరువు కట్ట తెగిందనే సమాచారం అందుకున్న వెంటనే బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు, బీబీఎంపీ కమిషనర్ బీహెచ్ అనిల్ కుమార్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేశారు. పల్లపు ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. వారిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. సుమారు 200 పైగా నివాసాలను ఖాళీ చేయించినట్లు బీబీఎంపీ అధికారులు వెల్లడించారు.