కు.ని. నినాదంతో మోదీకి కౌంటర్ -3ముక్కలు, 2పేర్లలో సాగు చట్టాలు -రాహుల్ సంచలనం -శ్రద్ధాంజలి
''వ్యవసాయ చట్టాలపై రెండున్నర నెలలుగా ఆందోళన చేస్తున్నారు.. కానీ వాళ్లకు కావాల్సిందేంటో, కొత్త చట్టాలతో కలిగే ఇబ్బందులేంటో సరిగా చెప్పలేకపోతున్నారు..''అంటూ ప్రతిపక్షాలు, రైతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన రీతిలో కౌంటరిచ్చారు. కేవలం మూడు ముక్కల్లో కొత్త వ్యవసాయ చట్టాల కంటెంట్(విషయం), దాని వెనకున్న ఇంటెంట్(ఉద్దేశం)ను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అధికార పార్టీ ఎంపీల అరుపుల నడుమ.. ఉద్యమ సమయంలో అమరులైన రైతులకు సభలో శ్రద్ధాంజలి కూడా ఘటించారు..
ys sharmila ఊపుతో జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ -మళ్లీ సమైక్య రాష్ట్రం -వైఎస్ ఆశయం: జగ్గారెడ్డి సంచలనం
రాహుల్ కీలక ప్రసంగం..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం కూడా రికార్డయిన దరిమిలా సంబంధిత చర్చకు ముక్తాయింపునిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం లోక్ సభలో కీలక ప్రసంగం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రత్యేక చర్చకు ప్రభుత్వం నిరాకరించిన దరిమిలా తాను బడ్జెట్ పై కాకుండా, కేవలం వ్యవసాయ చట్టాల గురించే మాట్లాడుతానంటూ రాహుల్ కొనసాగించగా, అధికార బీజేపీ సభ్యులు ఆయనకు అడ్డుతగిలారు. అరుపులు, కేకల మధ్యే రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ నేత ఏమన్నారో ఆయన మాటల్లోనే...
3 ముక్కల్లో 3 చట్టాల కంటెంట్..
''వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతోన్న ప్రతిపక్షాలకు విషయం తెలీదని ప్రధాని మోదీ సెలవిచ్చారు. ఆయనను సంతోషపెట్టడాకే ఇవాళ నేను మాట్లాడుతాను. కేవలం మూడు ముక్కల్లో కొత్త వ్యవసాయ చట్టాల కంటెంట్, ఇంటెంట్ లను తెలియజేస్తారు. ముందు కంటెంట్ గురించి చెప్పుకుందాం.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగుచట్టాల్లో మొదటి చట్టం.. ఒక వ్యక్తి దేశంలో ఎక్కడైనా ఎంతైనా పంటను కొనొచ్చని చెబుతోంది. ఆ కొనుగోళ్లకు ఒక లిమిట్ అంటూ ఉండదు. అంతిమంగా ఇది ప్రభుత్వ మార్కెట్ యార్డులు(మండీ)లను ఖతం చేస్తుంది. ఇక రెండో చట్టంతో బడా వ్యాపారులు పెద్ద మొత్తంలో పంటను స్టోరేజ్ చేసుకోడానికి, ఇష్టమొచ్చినప్పుడు అమ్ముకోడానికి వీలు ఏర్పడుంది. దీని ద్వారా నిత్యావసర సరుకుల చట్టం ఖూనీ అయిపోతుంది. ఇక మూడో చట్టం.. రైతులకుండే హక్కుల్ని హరిస్తుంది. అంటే, బడా కంపెనీలు మద్దతు ధర చెల్లించని పక్షంలో రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించే వీలు లేకుండా చేశారు. ఇక ఇంటెంట్ విషయానికి వస్తే..
మేమిద్దరం.. మాకిద్దరు..
దేశంలో కుటుంబ నియంత్రణ కోసం కొన్నేళ్ల కిందట 'మేమిద్దం - మాకిద్దరు' అనే నినాదం వ్యాప్తిలో ఉండేది. కరోనా మహమ్మారి వేర్వేరు రూపాల్లో వచ్చినట్లుగానే, ఆ పాత నినాదాలు కూడా ఇప్పుడు కొత్త రూపును సంతరించుకున్నాయి. ప్రస్తుం మోదీ ''మేమిద్దం.. మాకు ఇద్దరు'' అనే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ దేశాన్ని కేవలం నలుగురు వ్యక్తులు పాలిస్తున్నారు. మేమిద్దం -మాకిద్దరు నినాదంలో ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లేమిటో దేశ ప్రజలందరికీ తెలుసు. సాగుచట్టాల్లో మొదటి చట్టం ఇంటెంట్.. పంటలన్నీ ఒక మిత్రుడి చేతికి అందజేయడం. దాంతో రైతులు, కూలీలు, చిన్న దాకాణదారులు తీవ్రంగా నష్టపోతారు. ఇక రెండో చట్టం ఇంటెంట్.. మన మోదీ గారి రెండో మిత్రుడికి దేశంలో ఫుడ్ స్టోరేజీపై మోనోపలి వచ్చేస్తుంది. 40 శాతం పంటలు ఆ ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకే వెళతాయి. ఇక్కడ మరోసారి మనం మోదీ చేసిన కామెంట్లను గుర్తుచేసుకోవాలి..
దేశానికి మోదీ 3 ఆప్షన్లు..
సాగు చట్టాల అమలుపై నిర్బంధం లేదని, ఆప్షన్లు ఇచ్చానని ప్రధాని మోదీ చెప్పారు. నిజమే ఆయన దేశానికిచ్చిన మూడు ఆప్షన్లు.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నిజానికి మోదీ 'మేమిద్దరం-మాకిద్దరు' పాలసీ ఇవాళే కొత్తగా మొదలైందికాదు.. 2008లో నోట్ల రద్దు నిర్ణయంతోనే ఆయనా పాలసీకి శ్రీకారం చుట్టారు. పేద ప్రజల డబ్బులు మొత్తాన్ని లాగేసుకుని, బ్యాంకులకు తరలించి, తన వాళ్లయిన ఆ నలుగురు వ్యక్తులకు లబ్ది చేకూర్చాడు. నోట్ల రద్దుతో చిరువ్యాపారులు, ఎంఎస్ఎంఈలు కుదేలైపోయారు. ఆ వెంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) తీసుకొచ్చారు. ముందూ వెనకా ఆలోచించకుండా కరోనా లాక్ డౌన్ విధించి.. కోట్ల మంది జీవితాలతో ఆటలాడుకున్నారు. అల్లాడిపోయిన పేదలు.. కనీసం రైలు టికెట్టు కొనివ్వమన్నా మోదీ కనికరించలేదు. కరోనా సమయంలోనూ తన ఇద్దరు మిత్రులకు ప్రధాని ఏరకంగా ఉపయోగపడ్డారో లెక్కలు అందుబాటులోనే ఉన్నాయి. మొత్తంగా..
రైతుల చేతిలో పతనం తప్పదు
వరుసగా తప్పుడు నిర్ణయాలతో పేద, మధ్యతరగతి వర్గాలను దెబ్బతీసిన ప్రధాని మోదీ.. ఉపాధి రంగాన్ని నాశనం చేశాడు. కొత్త వ్యవసాయ చట్టాలతో దేశం వెన్నెముక అయిన రైతులను కూడా పూర్తిగా ఛిద్రం చేస్తున్నాడు. ఇవాళ రైతులు చేస్తోన్న నిరసనలు కేవలం వ్యవసాయ రంగానికే పరిమితమైనవి కావు. కావాలంటే రాసిపెట్టుకోండి.. చీకటి మయంగా మారిన ఈ దేశ భవిష్యత్తుకు రైతులు టార్చిలైట్లుగా ఉన్నారిప్పుడు. ఈ ఉద్యమం దేశవ్యాప్తం కావడం తథ్యం. 'మేమిద్దం మాకిద్దరు' అంటోన్న మోదీ విధానాలకు వ్యతిరేకంగా దేశం యావత్తూ ఒక్కటవుతుంది. ఇదే రైతులు.. ఇదే కూలీలు.. ఇదే చిన్నవ్యాపారులు మిమ్మల్ని(బీజేపీ సర్కారును) నేలకేసి కొడతాయి. కొత్త సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేదాకా రైతులు ఇంచు కూడా తగ్గబోరు'' అని రాహుల్ గాంధీ అన్నారు.రెండున్నర నెలల ఉద్యమ కాలంలో సుమారు 200 మంది రైతులు అమరులయ్యారని గుర్తుచేసిన రాహుల్.. వారికి శ్రద్ధాంజలి ఘటిద్దామంటూ ఒక నిమిషంపాటు సభలో మౌనం పాటించారు. విపక్ష ఎంపీలందరూ ఆయన వెంటే నిలబడి రైతులకు నివాళి అర్పించారు. ఈ చర్యను తప్పు పడుతూ బీజేపీ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు.
సర్కారు మెజారిటీతో నడుస్తుంది కానీ దేశానికి ఏకాభిప్రాయమే దిక్కు -అది బీజేపీనే: ప్రధాని మోదీ