భూమిపై మనిషి విధ్వంసం... 4 దశాబ్దాల్లో 'వైల్డ్ లైఫ్'కి కనీ వినీ ఎరగని ముప్పు...
ప్రపంచ వన్య ప్రాణుల జనాభా గత నాలుగు దశాబ్దాల్లో సగటున 68శాతం మేర పడిపోయినట్లు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ తమ తాజా రిపోర్టులో వెల్లడించింది. 'లివింగ్ ప్లానెట్ 2020' పేరుతో వెలువరించిన ఆ రిపోర్టులో 1970-2016 మధ్య 4,392 పైచిలుకు జాతుల వన్యప్రాణుల జనాభా క్షీణించినట్లు అంచనా వేశారు. అందులో పలు క్షీరదాలు, పక్షులు, చేపలు, సరీసృపాలు, ఉభయచరాలు ఉన్నాయి. గతంలో కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు ఇలాంటి పరిస్థితి భూమిపై ఎప్పుడూ లేదని... అలాంటిది గడిచిన కొన్ని దశాబ్దాల్లోనే ఇలాంటి పరిణామం చోటు చేసుకుందని రిపోర్టులో తెలిపారు.
ఆ రిపోర్టు ప్రకారం... లాటిన్ అమెరికా,కరేబియన్ దీవుల్లో వన్యప్రాణుల జనాభా క్షీణత అత్యంత హీన స్థితిలో ఉంది. ఈ ప్రాంతాల్లో వన్య ప్రాణుల జనాభా సగటున 94శాతం మేర పడిపోయింది. గడ్డి భూములు,సవన్నా,అటవీ భూములు,చిత్తడి నేలలను జనావాసాలుగా మార్చడం,మితిమీరిన వేట,వాతావరణంలో మార్పులు తదితర అంశాలు ఈ పరిస్థితి కారణమయ్యాయి.
ఒకరకంగా 1970 నుంచి ఇప్పటివరకూ మానవ సమాజం మూడింట రెండు వంతుల వన్యప్రాణులను మాయం చేసిందని రిపోర్టు వెల్లడించింది. ఈ విధ్వంసం ఇక్కడితోనే ఆగిపోలేదని... రాబోయే దశాబ్దాల్లో దాదాపు 1 మిలియన్ వన్య ప్రాణుల ఉనికికి ముప్పు ఉందని పేర్కొంది. దాదాపు 5లక్షల జంతువులు,5లక్షల ఇతర జీవ జాతుల ఉనికికి ప్రమాదం ఏర్పడనుందని తెలిపింది.
ఇప్పుడున్న 21వ శతాబ్దంలో మానవ జీవన అవసరాల కోసం భూమి బయోకెపాసిటీని దాదాపు 56శాతం అధికంగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే మనుషులకు కూడా విపత్తు తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణం దెబ్బతిని,భూమిపై జీవజాతుల సమతుల్యం దెబ్బతిని వాతావరణంలో తీవ్ర మార్పులు వస్తాయని.... అది కోవిడ్ 19 లాంటి మహమ్మారి వ్యాధులకు దారితీస్తుందని చెబుతున్నారు.