జలప్రళయం: రెండేళ్ల తర్వాత కేదార్నాథ్లో వెలుగు చూసిన మనిషి పాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో జలప్రళయంలో మరణించిన వారి అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నాయి. హిమాలయాలలోని కేదారనాథ్ దేవాలయం సమీపంలో మరణించిన ఓ వ్యక్తి కాలి పాదం బయటపడింది. శిథిలాల కింద ఇంకా చాలా మంది అవశేషాలు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.
2013వ సంవత్సరం జూన్ లో హిమాలయ పర్వతాల పాద ప్రాంతాలను జల ప్రళయం ముంచెత్తింది. ఆ సందర్బంలో కొన్ని వేల మంది చనిపోయారు. చనిపోయిన కొన్ని వందల మంది మృతదేహాలు చిక్కలేదు. చాలా కాలం మృతదేహాల కోసం గాలించిన అధికారులు తరువాత లాభం లేదని వదిలేశారు.
ఈ ఘటనతో సుమారు 60 అడుగుల ఎత్తులో రాళ్లు, బురద, చెత్త చెదారం పేరుకుపోయాయి. ఈ శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని మరణించారని అప్పట్లో అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ శిధిలాలను తొలగిస్తున్నారు.
శనివారం స్థానికులు కేదారనాథ్ ప్రధాన ఆలయం సమీపంలోని 50 మీటర్ల దూరంలో శిథిలాలు తొలగించారు. ఆ సందర్బంలో మరణించిన వ్యక్తి పాదం బయటపడింది. పాదానికి అదే రోజు డీఎన్ఏ పరిక్షలు నిర్వహించి తరువాత పూడ్చివేశారు. శిథిలాలను తొలగిస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు.