షిరిడీలో మానవ అక్రమరవాణా.. డీజీపీకి హైకోర్టు ఆదేశం.. భార్య కోసం మూడేళ్ళుగా ఓ భర్త అన్వేషణ
షిరిడీ లో మానవ అక్రమ రవాణా జరుగుతుందా ? షిరిడీలో మిస్సయిన వ్యక్తుల కేసులలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదా ? తాజాగా బాంబే హైకోర్టు ప్రసిద్ధ సాయిబాబా ప్రసిద్ధ ఆలయం ఉన్న షిరిడీలో మానవ అక్రమ రవాణా కోణాన్ని పరిశోధించాలి అని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనంగా మారింది . హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని, దర్యాప్తు చెయ్యాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశించటం షిరిడీలో మిస్సింగ్ కేసుల వ్యవహారాన్ని తెరమీదకు తెస్తున్నాయి .
Recommended Video
తెరచుకున్న షిరిడీ సాయి ఆలయం .. కఠిన ఆంక్షలతో మహారాష్ట్రలోనూ .. గైడ్ లైన్స్ ఇవే !!
షిరిడీలో మానవ అక్రమ రవాణా .. దర్యాప్తుకు ఆదేశించిన హైకోర్టు
బాంబే హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో షిరిడి క్షేత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. షిరిడీ లో మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు ఆ దిశగా దర్యాప్తు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. బాంబే హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడానికి వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఆగస్టు 10వ తేదీన ఇండోర్ కు చెందిన ఓ కుటుంబం పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా ప్రసిద్ధ సాయిబాబా ఆలయాన్ని దర్శించింది . 2017 ఆగస్టు నెలలో మనోజ్ ధోనీ తన కుటుంబంతో కలిసి షిరిడీ సాయి బాబా ఆలయాన్ని దర్శించారు.
షిరిడీలో షాపింగ్ కు వెళ్లి తప్పిపోయిన ఓ ఇల్లాలు .. మూడేళ్ళుగా భార్య కోసం అన్వేషణ
మనోజ్ సోనీ , తన 38 సంవత్సరాల వయస్సు ఉన్న భార్య దీప్తితో పాటు తన ఇద్దరు పిల్లలతో కలిసి షిరిడికి వెళ్ళిన క్రమంలో, భార్య దీప్తి షిరిడిలో షాపింగ్ కి వెళ్ళారు. పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో, భర్త పిల్లల వద్ద ఉండగా, ఆమె షాపింగ్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుండి తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు భర్త మనోజ్ సోని మూడేళ్లుగా భార్య కోసం వెతుకుతూనే ఉన్నాడు . మూడేళ్లుగా తన భార్య కోసం స్టేషన్ల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పారు.
పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన మిస్సింగ్ బాధితురాలి భర్త
పోలీసులు తన భార్య మిస్సింగ్ వెనుక వివాహేతర సంబంధం ఏమైనా ఉందేమో అని వ్యాఖ్యలు చేశారని చెప్పిన మనోజ్ సోనీ తన కుటుంబ పరిస్థితి వివరించారు. తన భార్యకు అలాంటివేవీ లేవని, తాము అన్యోన్యంగా జీవించామని, భార్య లేక పిల్లలు తల్లి లేని వారిగా మారారని కోర్టులో ఆవేదన వ్యక్తం చేసిన మనోజ్ సోనీ విజ్ఞప్తిని గమనించిన బాంబే హైకోర్టు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మిస్సింగ్ కేసులను ఛేదించడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
2017-2020 అక్టోబర్ 27 మధ్య 279 మంది మిస్సింగ్ .. దర్యాప్తుకు రాష్ట్ర డీజీపీకి ఆదేశం
షిరిడీ లో మానవ అక్రమ రవాణా జరుగుతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేసిన కోర్టు షిరిడీలో మిస్సింగ్ కేసుల పై దర్యాప్తు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది..
కోర్టుకు పోలీసులు సమర్పించిన గణాంకాల ప్రకారం, 2017 మరియు 2020 అక్టోబర్ 27 మధ్య షిర్డీ నుండి 279 మంది మిస్ అయినట్లుగా నివేదించారు. వీరిలో 67 మంది వివాహితులు మరియు పెళ్లికాని మహిళలు ఇప్పటివరకు గుర్తించబడలేదని పేర్కొన్నారు.
గతంలోనూ మిస్సింగ్ కేసులు .. 2019లో 88 మంది మిస్సింగ్
కోర్టు షిరిడీలో మిస్సింగ్ కేసులపై ఆగ్రహం వ్యక్తం చెయ్యటం ఇదే మొదటి సారికాదు . నవంబర్ 22 2019 న ఒక్క సంవత్సరం లో 88 మంది మిస్ అయినట్లుగా గుర్తించిన కోర్టు, వారంతా షిరిడీ సాయి బాబా ఆలయాన్ని దర్శించడం కోసం వచ్చిన వారేనని పేర్కొంది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై గతంలోనూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీని మానవ అక్రమ రవాణా, మానవ అవయవాల అక్రమ రవాణా కోణంలో మిస్సింగ్ కేసుల దర్యాప్తు చేయాలని ఆదేశించింది.