కులం మతం లేని రక్తం... హిందూ మహిళ ప్రాణం కాపాడింది
అస్సోం: మానవత్వం ముందు మతం చిన్నబోయింది. అసలే ఇది రంజాన్ మాసం. ముస్లింలు ఎంతో నిబద్ధతతో ఉంటారు. ప్రతి రోజు ఉపవాసం చేస్తారు. పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తారు. అలాంటి ఈ పవిత్రమైన మాసంలో మున్నాఅన్సారీ అనే వ్యక్తి ఎంతో నిష్టతో చేస్తున్న ఉపవాస దీక్షను విరమించాడు.
రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టిన మున్నా
అస్సోంకు చెందిన మున్నా అన్సారీ అనే వ్యక్తి పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నాడు. అనుకోకుండా ఒకరోజు ఓ హాస్పిటల్ నడుపుతున్న తన మిత్రుడి నుంచి ఫోన్ వచ్చింది. చాలా అత్యవసరంగా బీ నెగిటివ్ గ్రూపునకు చెందిన బ్లడ్ కావాలని అతను మున్నాకు ఫోన్లో చెప్పాడు. రేవతి బోరా అనే ఓ హిందూ మహిళకు అత్యవసరంగా రక్తం ఎక్కించాలని చెప్పడంతో మానవత్వంతో స్పందించాడు. ఆచారాలు పక్కకు పెట్టి హాస్పిటల్ వద్దకు పరుగులు తీశాడు.
దీక్ష విరమించి హిందూ మహిళకు రక్తదానం చేసిన మున్నా
గత మూడు రోజులుగా రేవతికి సరిపోలే రక్తం దొరకడం లేదని జిల్లా బ్లడ్ బ్యాంకులో కూడా లేదని చెప్పారు ఆమె కుటుంబ సభ్యులు.మూడు రోజుల తర్వాత టీమ్ హ్యూమానిటీ వాలంటరీ బ్లడ్ డోనార్స్ గ్రూపు అనే ఫేస్బుక్ పేజ్లో బీ నెగిటివ్ గ్రూపునకు చెందిన దాతలు ఎవరైనా తన తల్లికి రక్తం ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడాలని పోస్టు చేశాడు రేవతి కొడుకు. ఇది చూసిన మున్నా తన ఉపవాస దీక్షను వీడి ముందుగా ఆ తల్లిని కాపాడేందుకు పరుగులు తీశాడు.
రక్తసంబంధంతోనే బంధాలు ఏర్పడవు.. రక్తదానంతో కూడా ఏర్పడుతాయి
మున్నా రక్తం ఇవ్వడంతో రేవతి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మున్నాకు రుణపడి ఉంటామని చెప్పారు. మున్నాతో తమకు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినప్పటికీ తన తల్లికి రక్తం ఇవ్వడం ద్వారా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరుగా ఎప్పటికీ గుర్తిండిపోతారని వారు చెప్పారు. మీడియాతో మాట్లాడిన రేవతి కొడుకు అనిల్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేవలం రక్త సంబంధంతోనే బంధాలు ఏర్పడవనేదానికి మున్నా నిదర్శనమని చెప్పాడు.