కండక్టర్ అంత పనిచేస్తాడని ఎవరూహించలేదు!!
కర్ణాటక : నిత్యం ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏదెలా ఉన్నా.. చిల్లర విషయంలో మాత్రం ప్రయాణికులకు కండక్టర్లకు మధ్య జరిగే పేచీలకు లెక్కే లేదు. కొన్నిసార్లు చిల్లర లేకపోతే.. టికెట్ వెనుక రాసి స్టాప్ వచ్చాక తీసుకోమని ప్రయాణికులకు చెబుతుంటారు కండక్టర్లు. పొరపాటున మరిచిపోయినా.. ఉద్దేశపూర్వకంగానే మరిచిపోయినా.. పేచీ మరింత పెద్దదవడం ఖాయం.
తాజాగా కర్ణాటకలోను ఇదే జరిగింది. మంగళూరు నుంచి ఆలంగూరు వెళుతోన్న ఆర్టీసీ బస్సులో.. ఓ మహిళా ప్రయాణికురాలు టికెట్ నిమిత్తం రూ.500 నోటును కండక్టరు దేవదాస్ శెట్టి (24)కు ఇచ్చింది. అయితే టికెట్టుకు సరిపడా చిల్లర లేకపోవడంతో.. దిగేప్పుడు తీసుకోమని సదరు ప్రయాణికురాలికి చెప్పాడు కండక్టర్.
తీరా ఆమె దిగాల్సిన స్టేజీ వచ్చి.. చిల్లర కోసం అడగ్గా.. అసలు పేచీ అప్పుడు మొదలైంది. 'నువ్విచ్చింది రూ.100,అని కండక్టరు.. కాదు, రూ.500 ఇచ్చానని ప్రయాణికురాలు..' ఇలా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆమె తన బంధువులకు ఫోన్ చేసి పిలిపించింది. అక్కడికి చేరిన ఆమె తరుపు బంధువులు.. విషయం తేల్చడానికి బస్సును కందబ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్ కు వెళ్లాక.. కండక్టర్ బ్యాగులో ఉన్న డబ్బును, టికెట్టు ఖరీదుతో బేరీజు వేస్తూ లెక్కేయగా.. బ్యాగులో అసలు కంటే రూ.500 ఎక్కువగా ఉన్నట్టు తేలింది. తప్పు బయటపడడంతో.. కండక్టర్ దేవశెట్టి అందరిముందు క్షమాపణలు చెప్పుకున్నాడు. అనంతరం బస్సు మళ్లీ బయలుదేరడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన కండక్టర్.. తన ఆత్మగౌరవం దెబ్బతిన్న విషయాన్ని ఓ చిట్టి ద్వారా డ్రైవర్ బ్యాగులో పెట్టాడు. బస్సు ఓ నది బ్రిడ్జి మీదుగా వెళుతున్న సమయంలో..ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు.
ఈ అనూహ్య ఘటనతో కంగు తిన్న డ్రైవర్.. కండక్టర్ తో పేచీ పెట్టుకున్న మహిళా ప్రయాణికురాలి మీద, కదంబ పోలీసుల మీద మరో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం నదిలో గల్లంతైన కండక్టర్ దేవదాస్ శెట్టి ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు.