జామియా వర్సిటీ వీసీ ఆఫీస్ ముట్టడి: విద్యార్థులకు వీసీ నజ్మా హామీ, పోలీసులపై ఎఫ్ఐఆర్...
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జామియా మిలీయా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం వైస్ ఛాన్సలర్ నజ్మా అక్తర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీ ఎత్తున చేరుకున్న విద్యార్థులు ఢిల్లీ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వీసీని డిమాండ్ చేశారు.
వీసీ కార్యాలయం ముట్టడి
ఇటీవల యూనివర్సిటీలోకి వచ్చి తమపై లాఠీ ఛార్జీ చేసిన నేపథ్యంలో విద్యార్థులు ఈ మేరకు ఆందోళన చేపట్టారు. అంతేగాక, పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసి ప్రకటించాలని, విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రధాన గేటు తాళం పగలగొట్టిన విద్యార్థులు వీసీ కార్యాలయ ఆవరణలో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. వీసీ తమతో మాట్లాడాలని కోరారు.
విద్యార్థులకు వీసీ హామీ..
ఈ క్రమంలో విద్యార్థుల ముందుకు యూనివర్సిటీ వీసీ నజ్మా అక్తర్ వచ్చి మాట్లాడారు. విద్యార్థులకు రక్షణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిసెంబర్ 15న పోలీసులు అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి అడుగు పెట్టారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ రేపటి నుంచి కొనసాగుతుందని చెప్పారు. పోలీసులు వర్సిటీలో జరిగిన దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని, తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. వీసీ హామీతో విద్యార్థులు శాంతించారు.
15న భారీ ఆందోళనలు..
కాగా, గత డిసెంబర్ 15న జామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ ఆవరణలో భారీ ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ బయట కూడా నిరసనలు చేస్తూ ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు స్వల్ప విధ్వంసానికి దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి విద్యార్థులను అడ్డుకున్నారు.
పోలీసుల దాడితో..
యూనివర్సిటీలోకి వచ్చి పలువురు విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, పోలీసులు అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వీసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని పలు వర్సిటీల్లో విద్యార్థులపై దాడులకు నిరసనగా భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. విద్యార్థులకు కాంగ్రెస్ తోపాటు విపక్షాలు మద్దతు పలికాయి.