బహుదూరపు 'బాధ'సారులు..!చిన్నబోతున్న వందల కిలోమీటర్లు..!ఛిద్రమైన కూలీల బతుకులు..!
హైదరాబాద్ : ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ వలస కూలీల బ్రతుకులను అగమ్యగోచరంలోకి నెట్టేసింది. బ్రతుకుతెరువు కోసం తల్లిలాంటి స్వగ్రామాలను వదిలేసి సుదూర ప్రాంతాల్లో కూలీలుగా జీవనం సాగిస్తున్న వలస కార్మికులను అత్యంత దయనీయ స్థితిలోకి నెట్టేసింది కరోనా. కరోనా వైరస్ కట్టడికోసం ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంతో వలసకార్మికుల బ్రతుకులు ప్రశ్నార్థకమయ్యాయి. ఉండడానికి గూడులేక, తినడానికి తిండిలేక, చిన్నపిల్లలతో అనేక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రముఖ TV News ఛానల్ లో 28 మందికి కరోనా పాజిటివ్, 2,500 మందికి, మీడియా!
వలస కూలీల బాధలు..
ఊరు కాని ఊరిలో పడే కష్టాల కన్నా సొంతూరు చేరుకుంటే ఐనవాళ్ల మద్య ఆప్యాయతాగా ఉండాలని నిర్ణయించుకున్న కార్మికులు వందల కిలోమీటర్ల దూరాన్ని సైతం లెక్క చేయకుండా కాలినడకన, ఎర్రటి ఎండలో, చిన్న పిల్లలను బుజాలమీద మోస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. ప్రయాణం మద్యలో పోలీసుల వేధింపులు, ప్రమాదాలు, ఆకలి బాధలు శరాఘాతంగా మారినా, మొక్కవోని పట్టుదలతో కాళ్ల నొప్పులు బాధిస్తున్నా, నడచీ నడిచీ అరికాళ్ల చర్మం ఊడిపోతున్నా వారి నడక మాత్రం ఆగిపోవడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో వలస కార్మికుల సంక్షేమం అంటూ నీతులు వల్లె వేస్తున్న ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రవాణా వ్యవస్ధ మీద సన్నగిల్లిన నమ్మకం..
కరోనా వైరస్ క్లిష్ట సమయంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల మీద అనేక విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన ప్రణాళిక లేకుండా లాక్డౌన్ ఆంక్షలు విధించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో అనేక పనులతో, అనేక కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా లాక్డౌన్ విధించారని సామాన్య పౌరులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా రెక్కాడితే గాని డొక్కాడని లక్షలాది మంది వలస కార్మికుల గురించి కార్యాచరణ రూపొందించక ముందే కఠిన ఆంక్షలు అమలు చేసారనే విమర్శలు వెలుగుచూస్తున్నాయి. కరోనా వంటి క్లిష్ట సమయంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు కూడా రచ్చ చేస్తున్నాయి.
సరైన మార్గదర్శకాలు లేవు..
అంతే కాకుండా వలస కార్మికుల అంశంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించడమే కాకుండా, రాష్ట్రాలకు పూర్తి మార్గదర్శకాలు చూపించకుండానే లాక్డౌన్ ఆంక్షలు అమలు చేయడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. కోట్ల మంది పేద ప్రజలు, కూలీలు, సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రోడ్ల మీద అనాథలుగా నడక ప్రారంభించారు. వందలు, వేల కిలోమీటర్లు నడుస్తూ ప్రమాదకర స్థితిలో ఇళ్లకు చేరుకుంటున్నారు. వీరిలో లక్షల మంది ఖాళీ కడుపుతో నడిచారు. దాహంతో మరణాలు సంభవించడం చరిత్రలో ఘోరమైన విపత్తుగా సంభవించింది. ఇక దారిలో జరిగిన ప్రమాదాల్లో 170 మందికి పైగా మరణించారు. ఇది భారతదేశపు అత్యంత విషాదకరమైన, ప్రభుత్వం సిగ్గుపడదగిన సంఘటనగా పరిణమించింది.
ఛిద్రమైన బతుకులు..
దేశ స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో కనిపించిన అత్యంత ఘోర సంక్షోభం, అమానవీయ ఘటనలను ఈ వలస కూలీల ప్రయాణం రుజువు చేస్తున్నాయి. ఇందులో మోడీ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఏమీ ఆలోచించకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం కాని రాష్ట్రంలో చిక్కుకుపోయిన కార్మికుల గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన చేయలేదని తెలుస్తోంది. మినహాయింపులలో భాగంగా రైళ్లను పున:ప్రారంభించినప్పటికి వసల కార్మికుల అంశంలో సమన్వయం లోపించిదని తెలుస్తోంది. అంతే కాకుండా వేదనలో ఉన్న నిరాశ్రయులైన కార్మికుల నుండి ఛార్జీలను తీసుకునే ప్రయత్నం చేయడం పెద్దయెత్తున విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా రైళ్లు ప్రారంభించాక కూడా కాలి నడకన వెళ్తున్న వారిని మాత్రం ఆపే ప్రయత్నం ఏ ప్రభుత్వాలు చేయలేదు. అందుకే వారు బహుదూరపు బాటసారులుగా, బాధసారులుగా మిగిలిపోతున్నారు.