కన్నీటి గాథ: ఆకలికి అలమటించి చనిపోయిన చిన్నారులు
అన్నెం పుణ్యం తెలియని అమాయక చిన్నారులు వీళ్లు... భగవంతుడి అద్భుత సృష్టి వీళ్లు...వీరి చిరునవ్వు చూస్తే చాలు... రోజంతా పడ్డ కష్టాన్ని ఇట్టే మరిచిపోతాము.. వీరు మాట్లాడే మాటలు వింటే చాలు కడుపు నిండిపోతుంది. కానీ ఈ ముద్దులొలికించే చిన్నారులు మాత్రం కడుపు నిండక లోకాన్ని వదిలి వెళ్లారు. ఆకలితో అలమటించి... అమ్మా అమ్మా అని ఏడ్చి ఏడ్చి చివరికి తమను సృష్టించిన భగవంతుడి దగ్గరకే వెళ్లిపోయారు. ఈ కన్నీటి ఘటన ఢిల్లీలోని మందావలి ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు ఆకలితో అలమటించి మృతిచెందారు. ముగ్గురు చిన్నారుల వయస్సు రెండేళ్లు, నాలుగేళ్లు, ఎనిమిదేళ్లు. తల్లి మానసిక వికలాంగురాలు కావడంతో వారి ఏడుపు ఆ తల్లి మెదడుకు చేరలేదు. తండ్రి రోజూ కూలి పనికి వెళ్లేవాడు.
మంగళవారం కూడా ఎప్పటిలాగే కూలీ పనికి వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం మందావలి ప్రాంతంలోని తమ బంధువుల ఇంటికి ఈ కుటుంబం వెళ్లింది. ఇంట్లో వారు ఏదో పనిమీద బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే పిల్లలు ఆకలితో గట్టిగా ఏడ్చారు. తల్లి ఇంట్లో ఉన్నప్పటికీ ఆమెకున్న ఆరోగ్య సమస్యతో స్పందిచలేదు. అలా ఏడ్చిన ముగ్గురు చిన్నారి తల్లుల గొంతు ఒక్కసారిగా మూగబోయింది.
అప్పటి వరకు పొరుగింటివారికి వినపడ్డ ఆ చిన్నారుల గొంతులు ఒక్కసారిగా మూగబోవడంతో ఏమి జరిగిందో చూద్దామని ఇంట్లోకి వెళ్లారు. అంతే ముగ్గురు పిల్లలు స్పృహ కోల్పోయి పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే దగ్గరలోని లాల్ బహుదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు డిక్లేర్ చేశారు. అయితే పోస్టు మార్టంలో వైద్యులు ఇచ్చిన నివేదిక మాత్రం పలువురిని కదిలించింది.
పిలల్ల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని కేవలం ఆకలికి తట్టుకోలేకనే మృతిచెందారని వైద్యులు తెలపడంతో అక్కడివారు ఒక్కసారిగా భోరుమన్నారు. అయితే మరోసారి పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. అయితే ఈ సారి మరో హాస్పిటల్కు చిన్నారుల మృతదేహాలను తరలించారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు కేసుకు సంబంధించి మెజిస్టేరియల్ విచారణ వేశామని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ బీజేపీలు కేజ్రీవాల్ సర్కార్పై విమర్శలు గుప్పించారు.
పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బాధిత కుటుంబానికి సత్వరమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.