'బకరా': మేక ఆకలికి యజమాని బలి.. ఊహించని షాక్!
సర్వేష్ కుమార్ పాల్ అనే రైతు ఇంటి నిర్మాణ పనుల కోసం రూ.66వేల నగదును ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. స్నానానికి సిద్దమైన సమయంలో ప్యాంటును పక్కనపెట్టి వెళ్లాడు.
కాన్పూర్: ఓ మేక ఆకలికి యజమాని బలైపోయాడు. ఆకలితో ఉన్న మేక కరెన్సీ కాగితాలను ఆవురావురుమంటూ నమిలి మింగేసింది. తినేసింది తన డబ్బులే అని తెలిశాక బకరా చేతిలో బకరా అయిపోయానని గ్రహించాడు యజమాని. అప్పటికే రూ.66వేల వరకు స్వాహా అనిపించడంతో.. ఇక చేసేదేమి లేక లబోదిబో అంటూ గుండెలు బాదుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా సిలువాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సర్వేష్ కుమార్ పాల్ అనే రైతు ఇంటి నిర్మాణ పనుల కోసం రూ.66వేల నగదును ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. స్నానానికి సిద్దమైన సమయంలో ప్యాంటును పక్కనపెట్టి వెళ్లాడు. తీరా వచ్చి చూసేసరికి అందులో ఉన్న డబ్బంతా మేక తినేసింది. ప్యాంటులో మొత్తం 31నోట్లు ఉండగా.. ఒకటి, అరా తప్ప మిగిలినవాటన్నింటిని మేక నమిలి మింగేసింది.
స్నానం చేసొచ్చాక.. మేక చేసిన పనికి ఏం చేయాలో తెలియక సర్వేష్ లబోదిబోమన్నాడు. సర్వేష్ అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంతో ఆ మేక మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది యువకులు దానితో సెల్ఫీలు కూడా దిగి వెళ్తున్నారు.