జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడికి సాయం.. ఇద్దరు BSNL ఉద్యోగులు సస్పెన్షన్..!
శ్రీనగర్ : హురియత్ నేత, జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీకి సాయం చేసిన కేసులో ఇద్దరు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై వేటు పడింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన బిల్లు ఆంక్షల నేపథ్యంలో ఆయనకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సహకరించారనే ఆరోపణలు వారి ఉద్యోగాలకు ఎసరు తెచ్చింది.
91 సంవత్సరాల సయ్యద్ అలీ షా గిలానీ ఇటీవల చేసిన ట్వీట్ నేపథ్యంలో వివాదం రేగింది. అయితే కశ్మీర్లో ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం తదితర సేవలు నిలిపివేశారు. అయితే గిలానీ ఎలా ట్వీట్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గిలానీకి ఇద్దరు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సహకరించనట్లుగా తేలడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. ఆ క్రమంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టికల్ 370 రద్దు దరిమిలా జమ్ముకశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంది. అల్లర్లు చెలరేగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యంగా కమ్యూనికేషన్ సేవల్ని నిలిపివేసింది. ఆగస్టు 5వ తేదీన బిల్లు పాస్ కాక మునుపే ఒక రోజు ముందు అంటే ఆగస్టు నాలుగో తేదీనే కమ్యూనికేషన్ సేవల్ని స్తంభింపజేసింది.
అయితే గిలానీ మాత్రం ఎప్పటిలాగే తాను కొన్ని ట్వీట్లు చేయడం దుమారం రేపింది. ఆ క్రమంలో ఆయన ట్విట్టర్ ఖాతా కూడా స్తంభించిపోయింది. అయితే ఆగస్టు 8వ తేదీ ఉదయం వరకు ఆయనకు కమ్యూనికేషన్ సేవలు ఎలా అందాయనేది పెద్ద ప్రశ్నగా మారింది. జమ్ముకశ్మీర్ అంతటా కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించిపోతే ఆయన ఎలా ట్వీట్ చేశారనేది వివాదస్పదమైంది. గిలానీ చేసిన ట్వీట్లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే కారణంగా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. అదే క్రమంలో ఆయనకు ఇద్దరు ఉద్యోగులు సహకరించారని తేలడంతో వారిని విధుల్లోంచి సస్పెండ్ చేశారు.