భర్త్ డే పార్టీ: భర్తకు విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేసిన నవవధువు !
ఇష్టం లేని పెళ్లి చేశారని సహించలేని నవ వధువు భర్తను స్నేహితుడి బర్త్ డే పార్టీకి తీసుకు వెళ్లి తరువాత నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ తాగించి, విషయం కలిపిన ఇంజక్షన్ వేసి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని
బెంగళూరు: తల్లిదండ్రుల ఒత్తిడితో తనకు ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్న నవ వధువు భర్తకు విషపు ఇంజక్షన్ఇచ్చి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని హాసన్ నగరంలో జరిగింది. భార్య కుట్ర పసిగట్టలేని విశ్వనాథ్ (28) అనే యువకుడు హత్యకు గురైనాడు.
హాసన్ సమీపంలోని కిత్తనగర గ్రామానికి చెందిన విశ్వనాథ్ (28), ఆశ (25)ల వివాహం చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు. అయితే విశ్వనాథ్ ను పెళ్లి చేసుకోవడం ఆశకు ఇష్టం లేదు. ఇదే విషయం ఆశ ఆమె తల్లిదండ్రులకు చెప్పినా వారు పట్టించుకోలేదని తెలిసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదిన విశ్వనాథ్, ఆశల వివాహం వైభవంగా జరిగింది. అయితే తాను మెట్టినింటికి వచ్చి వ్యవసాయం చెయ్యలేనని ఆశ భర్త విశ్వనాథ్ కు తెగేసి చెప్పింది. పెద్దలు నచ్చచెప్పి ఆమెను మెట్టినింటికి పంపించారు. అయితే కొన్ని రోజులకే ఆశ పుట్టింటికి వెళ్లిపోయింది.
పెద్దలు పంచాయితీ చేసి ఆశకు నచ్చచెప్పి ఆమెను మెట్టినింటికి పంపించారు. ఇటీవల విశ్వనాథ్ స్నేహితుడి బర్త్ డే పార్టీ జరిగింది. ఆ భర్త్ డే పార్టీకి ఆశ తన భర్త విశ్వనాథ్ తో కలిసి వెళ్లింది. తరువాత హాసన్ నగరంలోని మహారాజ పార్క్ దగ్గరకు వెళ్లారు.
హాసన్ మహారాజ పార్క్ లో భర్త విశ్వనాథ్ కు బలవంతంగా నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ తాగిచింది. తరువాత భర్తకు విషం ఇంజెక్షన్ వేసిన ఆశ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. తన భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని నాటకం ఆడిన ఆశ కుటుంబ సభ్యులను నమ్మించింది.
స్పృహలోకి వచ్చిన విశ్వనాథ్ అతి కష్టం మీద ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. వెంటనే అతన్ని హాసన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత హాసన్ వైద్యుల సూచన మేరకు మైసూరు నగరంలోని కేఆర్ ఆసుపత్రికి తరలించారు.
అయితే మార్గం మధ్యలోనే విశ్వనాథ్ మరణించాడని వైద్యులు చెప్పారు. తమ కుమారుడిని ఆశ హత్య చేసిందని విశ్వనాథ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాసన్ నగర పోలీసులు కేసు నమోదు చేసి ఆశను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.