బోజనం పెట్టడు: విలపించిన ఐపీఎస్ అధికారి భార్య
చెన్నయ్: పోలీసులు నేరస్తులకు చిత్రహింసలు పెట్టారని మనం తరుచూ వింటూనే ఉంటాం. నేరం చేశారని నిరూపించడానికి వారు ఆ విధంగా ప్రవర్థిస్తారని అనుకుంటాం. అయితే ఒక సీనియర్ పోలీసు అధికారి తన సొంత భార్యను చిత్రహింసలకు గురి చేసిన విషయం వెలుగు చూసింది.
చెన్నై నగర డిప్యూటి పోలీసు కమిషనర్ సంతోష్ కుమార్ మీద అతని భార్య మేఘనా కుమార్ స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి తన భర్త మీద కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చెయ్యాలని ఆమె విలపించారు.
సోమవారం మధ్యాహ్నం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తరువాత మేఘనా కుమార్ మీడియాతో మాట్లాడారు. 11 సంవత్సరాల క్రితం 2004లో సంతోష్ కుమార్ తో తన వివాహం అయ్యిందని, 9 సంవత్సరాల కుమారుడు ఉన్నాడని మేఘనా కుమార్ అన్నారు.
అయితే కొంత కాలం నుండి తన భర్త సంతోష్ కుమార్ తనకు విలాసవంతమైన ఫ్లాట్, ఇంటి స్థలం, నగదు, నగలు ఇవ్వాలని వేదిస్తున్నాడని, చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. తన మీద ఫిర్యాదు చేస్తే కుమారుడిని కిడ్నాప్ చేస్తానని బెదిరించాడని అంటున్నారు.
అంతే కాకుండా తనకు రోజుకు రెండు పూటలు మాత్రమే భోజనం పెడుతున్నారని కన్నీరు పెట్టున్నారు. జూన్ 11వ తేది నుండి ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. తన భర్త మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు. వరకట్నం వేధింపులతో పాటు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి సీబీ సీఐడితో కేసు దర్యాప్తు చేయించాలని మేఘనా కుమార్ మనవి చేశారు.