వడ, సాంబార్ లో నూనె ఎక్కువ: భార్య ముఖం మీద అదే వేడినూనె పోశాడు, చివరికి !
బెంగళూరు: ఆహారంలో వంటనూనె ఎక్కువ అయ్యిందని ఆరోపిస్తూ ఓ కిరాతకుడు సలసల కాగే వంటనూనెను భార్య ముఖ మీద పోశాడు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన ఆమె చివరికి ప్రాణాలు విడించింది. కర్ణాటలోని కులబరగి సమీపంలో నివాసం ఉంటున్న ప్రియాంకా అనే మహిళ శనివారం మరణించింది.
కులబరిగి జిల్లాలోని జీవర్గి తాలుకా నేలోగి గ్రామంలో భీమాశంకర్, ప్రియాంక దంపతులు నివాసం ఉంటున్నారు. నవంబర్ 26వ తేదీన ప్రియాంక ఇంటిలో వంటలు చేసింది. ఆ సందర్బంలో సాంబర్, వడలలో వంట నూనె ఎక్కువ అయ్యిందని భీమాశంకర్ భార్యతో గొడవ పెట్టుకున్నాడు.
ఇంకో సారి ఇలా చెయ్యనని, ఈ ఒక్క సారి క్షమించాలని భార్య ప్రియాంక వేడుకునింది. అయితే భీమాశంకర్ వంట గదిలోకి వెళ్లి వంట నూనె సలసల కాగే వరకు వేడి చేశాడు. తరువాత వేడిగా ఉన్న వంటనూనె తీసుకు వచ్చి భార్య ప్రియాంక ముఖం మీద పోశాడు.
వేడిగా ఉన్న వంట నూనె ప్రియాంక ముఖ మీద పడటంతో ఆమె రెండు కళ్లు, ముక్కు, చెవులు కాలిపోయాయి. ముఖం మాడిపోయింది. వెంటనే ప్రియాంకను కులబరిగిలోని బసవేశ్వర ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాటం చేసిన ప్రియాంక డిసెంబర్ 2వ తేదీ శనివారం ప్రాణాలు విడించింది. భీమాశంకర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.