భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఆత్మహత్య.. అలా విసిగించడమే కారణం..
ఆ ఇద్దరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. సాఫీగా సాగుతున్న కాపురాన్ని ఆమె ప్రవర్తన అనుకోని మలుపు తిప్పింది. కొంతకాలంగా మడి ఆచారం అంటూ విపరీతమైన కట్టుబాట్లను పాటించడం మొదలుపెట్టింది. రోజుకు 10,15 సార్లు స్నానం చేసేది. భర్తను కూడా దూరం పెట్టేది. ఎన్నిసార్లు భర్త ఆమెకు చెప్పి చూసినా లాభం లేకపోయింది. చివరకు ఆమెను హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజన్గుడ్ తాలుకాలోని మండహళ్లిలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మండహళ్లికి చెందిన రైతు శాంతమూర్తి(40)కి,పుట్టమణి(38) అనే మహిళతో 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయిన చాలా ఏళ్ల వరకు వీరి కాపురం బాగానే సాగింది. కానీ పుట్టమణి ప్రవర్తనలో వచ్చిన అనూహ్య మార్పులు భర్త శాంతమూర్తిని ఇబ్బందిపెట్టాయి. మడి కట్టుబాట్ల పేరుతో విపరీత బుద్దులు చూపించేది.
రోజుకు 10,15 సార్లు స్నానం చేయడంతో పాటు భర్త, పిల్లలకు సైతం చల్లనీళ్లతో స్నానాలు చేయించేది. భర్తను దగ్గరకు రానిచ్చేది కాదు. దీంతో అతనిలో అసంతృప్తి పెరిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పి చూసిన పుట్టమణిలో మార్పు రాకపోవడంతో క్షణికావేశంలో ఆమెను హత్య చేసి.. మృతదేహాన్ని దూలానికి వేలాడదీశాడు. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.