ఘోరం: అందంగా ఉందని కన్ను పీకేశాడు.. బలైపోయిన భార్య!
తీవ్ర రక్త స్రావంతో పాటు భరించలేని వేదనతో ఆసుపత్రిలో చేరిన ఆమె చివరకు ప్రాణాలే కోల్పోయింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బెంగుళూరు: అందంగా ఉన్నా బాధే, లేకున్నా బాధే అన్నట్లుగా తయారైంది ఈరోజుల్లో ఆడపిల్లల పరిస్థితి. మూర్ఖపు మనస్తత్వంతో ఆలోచించేవాళ్లు భర్తలుగా దొరికితే.. ఆ నరకం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని వరుస ఘటనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అందంగా లేదన్న కారణంతో.. ఓ భర్త వేధింపులకు తాళలేక ఇటీవలే ఓ వివాహిత.. భవనంపై నుంచి దూకి చనిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇక ఇందుకు భిన్నంగా.. తన భార్య అందం ఎవరిని ఆకట్టుకుంటుందోనన్న చెత్త ఆలోచనతో.. ఓ భర్త ఏకంగా అతని భార్యకు గుండు గీశాడు. బెంగుళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇక నిన్నటికి నిన్న భార్య అందంగా ఉండటంతో.. ఎక్కడ లేని అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఏకంగా ఆమె కన్ను పీకేసి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. బెంగుళూరులోని బనశంకరిలో ఈ ఘటన చోటు చేసుకోగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది.
భార్యను అందవిహీనంగా మార్చితే ఎవరూ ఆమెతో మాట్లాడరన్న దుర్భుద్దితో.. బుధవారం మధ్యాహ్నాం రొట్టెకాడతో ఆమె కన్ను పీకేశాడు భర్త. తీవ్ర రక్త స్రావంతో పాటు భరించలేని వేదనతో ఆసుపత్రిలో చేరిన ఆమె చివరకు ప్రాణాలే కోల్పోయింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివాహితలపై భర్తలు చేస్తున్న ఈ దాష్టికాలు మహిళా లోకాన్ని కలవరపెడుతున్నాయి.