భర్త అక్రమ సంబంధం అన్ని వేళల్లో క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఓ మహిళ భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అన్ని సమయాల్లో క్రూరత్వం కిందికి రాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అది భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి క్రూరత్వం కాదని అభిప్రాయపడింది. గుజరాత్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆ విధంగా అభిప్రాయపడింది.
భార్యాభర్తల మధ్య సంబంధం బెడిసికొట్టి విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. భార్య మానానికి భార్యను వదిలేశాడు. తన వైవాహిక సంబంధం తెగిపోయే పరిస్థితి ఉందని తన సోదరికి చెప్పింది. తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోతానని చెప్పింది. కానీ, ఆ తర్వాత విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భర్త, అతని తల్లిదండ్రులు క్రూరత్వానికి ఒడిగట్టారని, భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకోవడమే ఆత్మహత్య చేసుకోవడానికి భార్యను ప్రేరేపించిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ట్రయల్ కోర్టు, హైకోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి, శిక్షలు విధించాయి.
ఈ కేసులో వరకట్నానికి డిమాండ్ లేదని, మరో మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె విచలిత అయిందనీ బాధకు గురైందని సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తులు ఎస్జె ముఖోపాధ్యాయ, దీపక్ మిశ్రా అంటూ అది ఐపిసి 498ఎ సెక్షన్ కింద క్రూరత్వం అవుతుందా అని ప్రశ్నించారు. భార్యాభర్తలు ఒకే ఇంటిలో విడివిడిగా ఉంటున్నారని, భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కొన్ని ఆధారాలున్నాయని, అది రుజవైనంత మాత్రాన అది క్రూరత్వం కిందికి వస్తుందని భావించలేమని అన్నారు. మానసికమైన క్రూరత్వం భార్య ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకుని వెళ్తుందని చెప్పడం కష్టమని అన్నారు.
నిందితుడు అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు రుజువులు ఉన్నప్పటికీ అది భార్య ఆత్మహత్య చేసుకునేంతటి క్రూరత్వం అవుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని, అందువల్ల అది సెక్షన్ 498ఎ సెక్షన్ కిందికి రాదని చెప్పారు.