భార్యను చిత్రహింసలు పెట్టి.. స్పృహతప్పి పడిపోయాక ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు
భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా... ఆమె స్పృహతప్పి పడిపోతే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడో వ్యక్తి... దీంతో 23 ఏళ్ల ఓ బాధిరాలు తనకు న్యాయం చేయాలంటూ మహిళా పోలీసులను ఆశ్రయించింది.
న్యూఢిల్లీ: భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా... ఆమె స్పృహతప్పి పడిపోతే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడో వ్యక్తి... దీంతో 23 ఏళ్ల ఓ బాధిరాలు తనకు న్యాయం చేయాలంటూ మహిళా పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్లితే గుజరాత్లోని రాజ్కోట్కి చెందిన అఫ్జల్ హుస్సేన్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం రుబీనా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారికిప్పుడు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. నాలుగేళ్ల పాటు మంచిగానే ఉన్న భర్త, అత్తమామలు.. క్రమంగా ఆమెపై వేధింపులు మొదలుపెట్టారు.
గతేడాది ఇంట్లో పని విషయమై గొడవ జరగడంతో భర్త తనను తీవ్రంగా కొట్టాడని బాధితురాలు రుబీనా ఆరోపించింది. స్పృహ తప్పి పడిపోయిన తనకు.. అదే అదనుగా తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది.
స్పృహలోకి వచ్చిన తర్వాత భర్త అప్జల్ తనకు విడాకులిచ్చేశాడంటూ అత్త తనను ఇంట్లో నుంచి గెంటివేసినట్టు బాధితురాలు పేర్కొంది. ''నేను తిరిగి స్పృహలోకి వచ్చే సరికల్లా అత్తింటి వారు నన్ను ఇల్లు వదిలి వెళ్లిపోవాలన్నారు. భర్త నాకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చేశాడంటూ వాదించారు..''
''అప్పడు నేను స్పృహలో లేనని.. భర్త ఏం చెప్పాడో కూడా తనకు వినిపించలేదని ఎంత చెప్పినా అంగీకరించలేదు. ఇంట్లో నుంచి వెళ్లిపోమంటూ గెంటేశారు...'' అని రుబీనా వెల్లడించింది.
అప్పటి నుంచి తాను కుమారుడితో పాటు తండ్రి ఇంటి వద్దే నివసిస్తున్నట్టు ఆమె పేర్కొంది. మరోవైపు మతపెద్దలు, కుటుంబ సభ్యులు ఇరువైపులా వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదని స్థానికులు చెబుతున్నారు.