కర్ణాటక ఎన్నికల్లో భార్య, భర్త పోటీ, అన్నదమ్ముల సవాల్, బీజేపీ నాయకుల మాస్టర్ ప్లాన్ !
బెంగళూరు: కుటుంబ రాజకీయాల్లో తండ్రి, కొడుకులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు పోటీ చెయ్యడం మనం ఇప్పటికే చూశాం. అయితే కర్ణాటకలో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో దంపతులు పోటీ చేస్తున్నారు. దంపతులు ఇద్దరు పోటీ చెయ్యడానికి బీజేపీ నాయకులు మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పటికే భార్య సిట్టింగ్ ఎమ్మెల్యే, భర్త తన రాజకీయ భవిష్యత్తుకు ఇప్పుడు పునాది వేస్తున్నారు.
అన్నదమ్ముల సవాల్
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సోరబ శాసన సభ నియోజక వర్గంలో మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారులు కుమార్ బంగారప్ప, మధు బంగారప్ప ఒకరి మీద ఒకరు పోటీ చేస్తున్నారు. తుమకూరులో సోదరులు ఒకరి మీద ఒకరు పోటీ చేస్తున్నారు.
భార్య సిట్టింగ్ ఎమ్మెల్యే
బెళగావి జిల్లా నిప్పాణి శాసన సభ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే శశికళా జోల్లేకి 2018లో మళ్లీ పోటీ చెయ్యడానికి బీజేపీ అవకాశం ఇచ్చింది. గతంలో రెండుసార్లు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన శశికళా జోల్లే ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
భారీ మెజారిటీ
శశికళ జోల్లే 2008లో నిప్పాణి నియోజక వర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసి 38,583 ఓట్లు సంపాధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాండురంగ పాటిల్ చేతిలో ఓడిపోయారు. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో శశికళా జోల్లే నిప్పాణి నియోజక వర్గంలో 81,860 ఓట్లు సంపాధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాండురంగ పాటిల్ ను ఓడించారు.
కాంగ్రెస్ కంచుకోటలో భర్త
బీజేపీ ఎమ్మెల్యే శశికళా జోల్లే భర్త అణ్ణా సాహేబ్ జోల్లే అనేక వ్యాపారాలు, సంఘ సంస్థల పేరుతో సమాజసేవ చేస్తున్నారు. ఆయన 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ కంచుకోట అయిన చిక్కోడి-సదాలగా శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. చిక్కోడి-సదాలగా నియోజక వర్గంలో కాంగ్రెస్ జెండా పీకేసి బీజేపీ జెండా ఎగరవేస్తానని అణ్ణా సాహేబ్ జోల్లే ధీమాతో ఉన్నారు.