జాత్యహంకారం: రష్యాలో హైదరాబాద్ యువతి పోరాటం
హైదరాబాద్/మాస్కో: హైదరాబాద్ నగరానికి చెందిన అఖిల పెమ్మసాని(26) అనే యువతి రాష్యాలో జాత్యహంకార దోరణికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఆమె మార్చి 2015లో రష్యాలో ఉద్యోగం కోసం వెళ్లారు. అయితే అక్కడ ఎదురైన పరిణామాలు, ఆమెను జాత్యహంకార దోరణికి వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా ప్రేరేపించాయి.
ప్రస్తుతం ఆమె చెర్నోగోరస్క్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్(ఈఎఫ్ఎల్-విదేశీ భాషగా ఇంగ్లీష్)గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఆమె రష్యాలోని మరో పాఠశాల సోలేలీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆమె రష్యా జాతీయురాలు కానందున ఆమెకు ఉద్యోగం ఇవ్వలేమిన పాఠశాల యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో అఖిల మే 3 నుంచి జాత్యహంకారంపై పోరాటం మొదలుపెట్టారు.
సెయింట్ పీటర్స్బర్గ్లోని ఆ పాఠశాల ఇచ్చిన వివరణ చూసి ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే రష్యాలో పుట్టి పెరిగిన వారైనా ఉండాలి లేదా బ్రిటిష్, అమెరికన్, ఆస్ట్రేలియన్, న్యూజిలాండర్, సౌతాఫ్రికన్లయినా అయి ఉండాలని పేర్కొంది పాఠశాల యాజమాన్యం. దీంతో అఖిల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్)కు ఈ జాత్యహంకార దోరణిపై ఓ మెయిల్ పంపారు. ఇది జాత్యహంకారం అనుకోవాలో లేదో తనకు తెలియడం లేదని పేర్కొంది.
ఈ పోరాటం అందరి కోసం
‘నా పోరాటం భారతీయుల కోసం మాత్రమే కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసం నా పోరాటం. వివక్షతకు వ్యతిరేకంగానే నా పోరాటం. ప్రపంచంలోని చాలా మందికి ఇలాంటి జాతి వివక్ష అనుభవం ఎదురవుతోంది. చాలా మంది తమ హక్కుల కోసం పోరాడటం మర్చిపోతున్నారు. ఏ దేశంలో పుట్టిన వారికైనా మరో దేశంలో ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉండాలి. ఇతర దేశాల నుంచి తమ అవసరాలకు నిపుణులను రప్పించుకోవడం జరుగుతుంది.' అని అఖిల పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నుంచి మార్గదర్శకాలు వచ్చాక తన పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పారు.
అంతేగాక, అఖిల ప్రస్తుతం ఆన్లైన్లో పిటిషన్ వేశారు. తన పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి నుంచి మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు అన్ని దేశాల నుంచి మద్దతు కావాలని కోరారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అభ్యర్థులకు జాతి వివక్షత కారణంగా ఉద్యోగాల్లో అవకాశం లభించడం లేదని తెలిపారు. తాను అప్లై చేసిన ఉద్యోగానికి అన్ని విధాలా అర్హురాలిని అయినప్పటికీ.. జాతి వివక్షత కారణంగా తనకు ఉద్యోగం ఇవ్వలేమిన పాఠశాల యాజమాన్యం పేర్కొందని అఖిల తెలిపారు.
అయితే తాను చేస్తున్న పోరాటాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. అర్హత ఉన్నవారికి జాతి వివక్షత లాంటి ఇతర ప్రాధామ్యాలను పక్కనబెట్టి ఏ దేశానికి చెందిన వారికైన ఉద్యోగం ఇవ్వాలనేది తన ఉద్దేశమని చెప్పారు. జూన్ 2015లో తన వీసా గడువు ముగుస్తుందని, తన వీసా గడువు ముగిసే లోపే తాను భారతదేశానికి చేరుకుంటానని, చట్టాన్ని ఉల్లంఘించడం తనకు ఇష్టం లేదని హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన అఖిల తెలిపారు.