హైదరాబాద్కు అరుదైన గుర్తింపు : ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ సిటీగా భాగ్యనగరం..
ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ (శక్తివంతమైన,క్రియాశీలకమైన) నగరంగా హైదరాబాద్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. సామాజిక ఆర్థిక అంశాలు,కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంశాల ప్రాతిపదికన నగరానికి ఈ గుర్తింపు దక్కినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ వెల్లడించింది. దేశంలో ఆర్థిక మందగమనం నెలకొనప్పటికీ.. భారత్ నుంచి మొత్తం ఏడు నగరాలు టాప్-20లో స్థానం సంపాదించుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 130 దేశాలపై అధ్యయనం చేసి డైనమిక్ సిటీల జాబితాను వెల్లడించారు.
హైదరాబాద్ టాప్ స్థానం..
ప్రపంచ డైనమిక్ నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవగా.. బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. చెన్నై ఐదో స్థానంలో,ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచాయి. ఇక పుణే,కోల్కతా,ముంబై వరుసగా 12,16,20 స్థానాల్లో నిలిచాయి. గతేడాది ఈ జాబితాలో బెంగళూరు అగ్ర స్థానంలో నిలవగా.. ఈసారి హైదరాబాద్ బెంగళూరును వెనక్కి నెట్టడం గమనార్హం. జీడీపి వృద్ధి, రిటైల్ అమ్మకాలు మరియు విమానాశ్రయ ప్రయాణికుల సంఖ్య పెరుగుదల వంటి ఆర్థిక సూచికలలో హైదరాబాద్ ప్రపంచ దేశాలన్నింటి కంటే అగ్ర స్థానంలో నిలిచినట్టు జేఎల్ఎల్ మొమెంటమ్ ఇండెక్స-2020 వెల్లడించింది.
ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ..
భారత్లో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాలు విదేశీ పెట్టుబడులను గణనీయంగా ఆకర్షిస్తున్నట్టు జేఎల్ఎల్ ఇండియా సీఈవో రమేష్ నాయర్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు పెట్టుబడులను ఆకర్షించడంలో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. దేశంలో ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ.. ప్రభుత్వ సంస్కరణలు మార్కెట్కు పారదర్శకతను తీసుకొస్తున్నాయని చెప్పారు. తద్వారా రియల్ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు.
అవే కారణం..
2019లో బెంగళూరుతో పోటీగా హైదరాబాద్ నగరం అద్భుతమైన వృద్దిని సాధించిందని రమేష్ నాయర్ వెల్లడించారు. సాంకేతిక పురోగతి వల్ల ఆర్థిక వృద్దిని సాధించిందని,దిగ్గజ టెక్ సంస్థలను,ఈకామర్స్ కంపెనీలను ఆకర్షించిందని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలు,ఉన్నతమైన మౌలిక సదుపాయాల కల్పన,సమర్థవంతమైన,ప్రతిభ గల వ్యక్తుల లభ్యత,అత్యన్నత శ్రేణి బిజినెస్ పార్కుల కారణంగా బెంగళూరును హైదరాబాద్ అధిగమించిందని వెల్లడించారు.
టాప్-20లో అత్యధికంగా ఏసియా దేశాలే..
ప్రపంచ డైనమిక్ నగరాల జాబితా టాప్-20లో నాలుగు వంతుల్లో మూడు వంతులు ఏసియా దేశాలే ఉండటం విశేషం. ఇందులో ఇండియా,చైనా,వియత్నాం దేశాలే ఎక్కువగా ఉన్నాయి. టాప్-20 నగరాల్లో చాలావరకు భవిష్యత్తులో అతి తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే నగరాలుగా మార్చడం కోసం అక్కడి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలను తగ్గించే చర్యల్లో భాగంగా ఏసీ(ఎయిర్ కండిషనర్లకు)లకు ప్రత్యామ్నాయంగా సూర్యరశ్మిని నుంచి తక్కువ వేడిని మాత్రమే గ్రహించే చల్లని పైకప్పులను అందుబాటులోకి తీసుకురావడానికి ఇక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు.మైక్రో మొబిలిటీ కూడా హైదరాబాద్కు మరో సానుకూల అంశంగా మారినట్టు రమేష్ నాయర్ తెలిపారు. ఎలక్ట్రిటీ వాహనాల పెరుగుదల,స్మార్ట్ బైక్స్ పరిచయం కూడా సానుకూలంగా మారినట్టు చెప్పారు.