ఇకపై అక్కడ హైదరాబాద్ అనే పేరు వినిపించదు!
బెంగళూరు: కర్ణాటకలో నిజాం కాలం నుంచీ మనుగడలో కొనసాగిస్తూ వస్తోన్న హైదరాబాద్-కర్ణాటక అనే పేరు కనుమరుగైంది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం పేరును మార్చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కల్యాణ కర్ణాటకగా నామకరణం చేసింది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి మండలి పేరును మార్చాలని కోరుతూ దశాబ్దాల కాలం నుంచీ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, దీనికి అనుగుణంగానే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. హైదరాబాద్ కర్ణాటక పేరును మార్చేస్తామని ఈ నెల 6వ తేదీ నాడే ఆయన ప్రకటించారు. మంగళవారం నుంచి అధికారింగా అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతం కోసం ప్రత్యే్కంగా సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పాకిస్తాన్ మంత్రి షాకింగ్ కామెంట్స్: మోడీ పుట్టిన రోజును గర్భ నిరోధక దినంగా అభివర్ణన!
చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం..
హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. నిజాం కాలం నుంచీ ఈ పేరు వాడుకలో ఉంటూ వచ్చింది. ఉత్తర కర్ణాటకలోని అనేక ప్రాంతాలు నిజాం పరిపాలన కింద కొనసాగిన విషయం తెలిసిందే. కలబురగి (గుల్బర్గా), బీదర్, రాయచూర్, యాద్గిర్, బళ్లారి, కొప్పళ వంటి ప్రాంతాలు నిజాం ఏలుబడిలో కొనసాగాయి. ఆయా ప్రాంతాలన్నింట్లోనూ తెలుగు వారి ప్రాబల్యం అధికం. తెలుగు మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయా జిల్లాల్లో నివసిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం అఖండ భారతావనిలో విలీనం కావడం, ఆ తరువాత చోటు చేసుకున్న రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా ఆ ఆరు జిల్లాలు కర్ణాటకలో కలిశాయి. అప్పటి నుంచీ వాటిని హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగా పిలుచుకుంటూ వస్తోంది కర్ణాటక ప్రభుత్వం. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాల్లోనూ ఇదే పేరు కనిపిస్తుంది.
విమోచన వేడుకల్లో యడియూరప్ప
ఇకపై హైదరాబాద్ కర్ణాటక పేరు కనిపించదు. హైదరాబాద్ పేరును తొలగించి కల్యాణ అని పేరును జత చేసింది కర్ణాటక ప్రభుత్వం. కల్యాణ కర్ణాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక గ్రాంటును ఇస్తామని యడియూరప్ప ప్రకటించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఈ ఉదయం ఆయన కలబురగికి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. పెద్ద ఎత్తున నిధులను గ్రాంటు రూపంలో విడుదల చేస్తామని చెప్పారు.
ఈ ఏడాది అంచనాలకు మించిన వర్షాలు కురవడం వల్ల వ్యవసాయ పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయని అన్నారు. పంట చేతికి అందేంత వరకు రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని యడియూరప్ప హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కలబురగిలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.