పార్లమెంట్ లో దిశ ప్రకంపనలు: లోక్ సభలో రేవంతరెడ్డి వాయిదా తీర్మానం: రాజ్యసభలో చర్చ..!
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన దిశ హత్యాచార ఉదంతం నేడు పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. దిశా ఘటనపై లోక్సభలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. దిశా ఘటన, దేశంలో హత్యాచారాలపై.. రాజ్యసభలో బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా జీరో అవర్ నోటీసులు ఇచ్చారు. అయితే జీరో అవర్లో చర్చిద్దామని లోక్సభ స్పీకర్ తెలిపారు.
క్వశ్చన్ రద్దుచేసి దిశ ఘటనపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఇటువంటి ఘటనల పట్ల చట్టాలు మరింత కఠినంగా అమలు చేయాలనే అభిప్రాయం వ్యక్తం అయింది.
రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం
యావత్ దేశాన్ని కదిలించిన దిశా హత్యాచార ఘటన పైన తక్షణం చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే, దీనిపైన జీరో అవర్ లో చర్చిద్దామంటూ స్పీకర్ రూలింగ్ అచ్చారు. అయితే, ప్రశ్నోత్తరాల సమయం కంటే ముఖ్యమైన అంశమని..దీని పైన తక్షణమే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేసారు. లోక్ సభలో చర్చ సమయంలో కాంగ్రెస్ తో సహా బీజేపీ సభ్యులు సైతం ఈ ఘటన మీద చర్చించటానికి సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు.
తెలంగాన ప్రాంత కాంగ్రెస్..బీజేపీ ఎంపీలు తమ ప్రభుత్వం లక్ష్యంగా ఏమైనా విమర్శలు చేస్తే తిప్పి కొట్టాలని ..దీని పైన స్థానిక పోలీసులు స్పందించిన తీరు..ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలను వివరించాలని భావిస్తున్నారు. ఇక, ఏపీ అధికార పార్టీ వైసీపీ నుండి వంగా గీత..టీడీపీ నుండి సభ్యులు సైతం చర్చల్లో పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయించారు.
రాజ్యసభలోనే చర్చలో అన్ని పార్టీలు..
ఇదే సమయంలో అటు రాజ్యసభలో బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా జీరో అవర్ నోటీసులు ఇచ్చారు. వెంటనే చర్చకు ఛైర్మన్ వెంకయ్య నాయడు అనుమతించారు. దీంతో..దిశ ఘటనపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. దిశ హత్య దేశం మొత్తాన్ని కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు.
నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలన్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల మాట్లాడుతూ.. హైదరాబాద్ ఘటన.. ఢిల్లీ ఘటనను గుర్తు చేసి మరోసారి ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసిందన్నారు. జీరో ఎఫ్ఐఆర్పై సుప్రీం ఆదేశాలను పాటించాలన్నారు. ఘటనకు ముందు పెట్రోలింగ్, రక్షణ చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్భయ చట్టంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వర న్యాయం జరుగుతుందని భావన కలిగేలా తీర్పు ఉండాలన్నారు. అన్ని పార్టీల నేతలు ఈ చర్చలో పాల్గొని..జరిగిన ఘటన పైన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు.
సత్వర న్యాయం జరగాలి..వెంకయ్య నాయుడు
సభ్యులు మాట్లాడిన తరువాత తన ఛైర్ వద్ద నిలబడే ఛైర్మన్ వెంకయ్య నాయుడు సైతం స్పందించారు. ఇటువంటి విషయాలు చోటు చేసుకోవటం బాధాకరమన్నారు. తల్లి తండ్రులు పిల్లలకు నీతి బోధనలు చేయాలని సూచించారు. జాతీయ రహదారుల పైన మద్యం దుకాణాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
కింది కోర్టు శిక్ష వేస్తే వారు పై కోర్టుకు అప్పీల్ కు వెళ్లే అవకాశం లేకుండా..కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ఘటనలు కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదని..దేశం మొత్తం చోటు చేసుకోవటం ఆందోళన కలిగించే అంశంగా వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు.