పార్లమెంటు క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ టీ
హైదరాబాద్/న్యూఢిల్లీ: అతి కొద్ది రోజుల్లో పార్లమెంటులో హైదరాబాద్ బిర్యానీ రుచి చూపించనున్నారు. హైదరాబాద్ బిర్యానీతో పాటు మిర్చీ కా సాలన్, షాహీ కా తుక్డా, కుబానీకా మీటా తదితరాలు రుచిని పార్లమెంటు సభ్యులకు చూపించనున్నారు. రానున్న శీతాకాల సమావేశాల నుండి వీటిని పార్లమెంటు క్యాంటీన్లో పెట్టనున్నారు.
అలాగే ఇరానీ చాయ్ కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు. హైదరాబాదీ బిర్యానీ తదితర ఆహార పదార్థాలతో పాటు ఇరానీ చాయ్ని కూడా ఈ శీతాకాల సమావేశాలకు పార్లమెంటు క్యాంటీన్లో అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నామని, చాలామంది సభ్యులు హైదరాబాద్ బిర్యానీని కోరుకుంటున్నారని, వారి కోరికను త్వరలో తీర్చుతామని తెరాస ఎంపీ, పార్లమెంటు ఫుడ్ కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి చెప్పారు.
ఇప్పటికే పార్లమెంటు క్యాంటీన్లో వెజిటేబుల్ పులావ్, బిర్యానీ ఉన్నాయని, అయితే, వాటికి హైదరాబాద్ బిర్యానీకి తేడా ఉంటుందన్నారు.
లోకసభలో 545 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో 243 మంది సభ్యులు ఉన్నారు. సభ్యుల కోసం హైదరాబాద్ బిర్యానీ తయారీలో శిక్షణ కోసం ఇద్దరు పార్లమెంటు క్యాంటీన్ కుక్లను హైదరాబాదుకు పంపించారు. హైదరాబాద్ బిర్యానీకి ప్రసిద్ధి గాంచిన నిజాం క్లబ్లో వారి ట్రెయినింగ్ పొందుతున్నారు.
హైదరాబాద్ ఆహారపదార్థాలు తయారీకి నలుగురు వంటవాళ్లను శిక్షణ ఇవ్వనున్నామని, ఇప్పటికే ఇద్దరు వంటవాళ్లు హైదరాబాద్ బిర్యానీ తయారీలో నైపుణ్యం సంపాదించేందుకు హైదరాబాద్ వెళ్లారని, నిజాం క్లబ్లో వారు దానిని తెలుసుకుంటున్నారని, మరో ఇద్దర్ని కూడా పంపిస్తామని జితేందర్ రెడ్డి తెలిపారు.
పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిటీ మీద ఎంపీలకు ఆహార పదార్థాలు లభిస్తాయి. నార్త్ ఇండియన్తో పాటు వివిధ రకాల ఆహారపదార్థాలు పార్లమెంటు క్యాంటీన్లో లభిస్తాయి. టొమాటో సూప్, చికెన్ శాండ్ విచ్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ సలాడ్, బ్రెడ్, ఫ్రైడ్ ఫిష్, చిప్స్, ఫుడింగ్, కిచిడీ, కర్డ్ రైస్ తదితరాలు లభిస్తాయి.