యోగి సేన హల్చల్: చర్చిలోకి చొచ్చుకెళ్లి ఆందోళన..
దళితులను బలవంతంగా మత మార్పిడి చేయిస్తున్నారన్న ఆరోపణలతో హిందూ యువ వాహిణి కార్యకర్తలు ఓ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
భందోహి: ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. హిందూ యువ వాహిణి దుందుడుకు చర్యలు మరింత ఎక్కువయ్యాయి. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సైతం హిందూ యువ వాహిణి స్వతంత్రంగా వ్యవహరించడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.
ఇదంతా పక్కనపెడితే.. తాజాగా దళితులను బలవంతంగా మత మార్పిడి చేయిస్తున్నారన్న ఆరోపణలతో హిందూ యువ వాహిణి కార్యకర్తలు ఓ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇంట్లోకి వెళ్లి మత మార్పిడిని అడ్డుకున్నారు. రవిదాస్ నగర్ జిల్లా ఔరాయి తాలుకాలోని తియూరి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
హిందూ యువ వాహిణి కార్యకర్తల ఫిర్యాదుతో.. మతమార్పిడి చేయిస్తున్న పాస్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళకు చెందిన ఆ పాస్టర్ను అజ్మన్ అబ్రహామ్గా గుర్తించారు. తియూరి గ్రామంలోని ఆ చర్చిలో గత కొన్నాళ్లుగా మతమార్పిడులు జరుగుతున్నాయని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే తామే స్వయంగా అడ్డుకున్నామని వివరించారు.
హిందూ యువ వాహిని జిల్లా అధ్యక్షుడు సుభాష్ శర్మ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ హెచ్ ఓ ఓంకార్ సింగ్ తెలిపారు. యూపీలో యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. హిందూ యువ వాహిణి కార్యకర్తలు చర్చిల ముందు ఆందోళన చేయడం ఇది రెండోసారి.
ఇంతకుముందు గత నెలలో మహారాజ్ గంజ్ లోని ఓ చర్చి వద్ద ప్రార్థనలను చేసుకుంటున్న 150మందిని పోలీసులు చెదరగొట్టారు. దీనికి సంబంధించిన కేసు కొనసాగుతుండగానే.. ఇప్పుడు మరో కేసు నమోదు కావడం గమనార్హం.