నేను కొరకురాని కొయ్య, లావుగా ఉన్న నన్ను తగ్గించలేరు: స్మృతి
న్యూఢిల్లీ: తాను ఒక కొరకురాని కొయ్యనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం చెప్పారు. తనను ఎవరూ తగ్గించలేరన్నారు. ఎందుకంటే తాను అంత లావుగా ఉన్నానని వ్యాఖ్యానించారు. తమ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)కు లోబడి పని చేస్తుందనేది వట్టిదే అన్నారు.
విద్యారంగం విషయానికి వస్తే తాను ఒక కొరకుడుపడని వ్యక్తిని అన్నారు. ఈ విషయంలో తాను బాధితురాలిని అయినట్లుగా భావించడం లేదన్నారు. పార్టీ నుండి ఏకాకిని అయినట్లు తాను ఏమీ భావించడం లేదన్నారు. తానొక సాధారణ కార్యకర్తనే గానీ, పార్టీలో నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదన్నారు.
తనకు అప్పగించిన బాధ్యతను రాజ్యాంగ పరిధిలో నిర్వర్తించడం తన కర్తవ్యమని చెప్పారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తున్నట్లుగా తానేమీ భావించడం లేదన్నారు. తగ్గించలేనంత లావుగా తాను ఉన్నానని, తనను ఎవరూ తగ్గించలేరన్నారు. విద్యాకాషాయీకరణ అనే వార్తలు వట్టివే అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన అందిస్తానని గెలిచారని చెప్పారు. అతను తనకు హెచ్చార్డీ మినిస్ట్రీని ఇచ్చారన్నారు. తాను తన బాధ్యతలను నెరవేరుస్తున్నానని చెప్పారు. పార్లమెంటులో తన పర్ఫార్మెన్స్ను యావత్ దేశం చూస్తోందన్నారు. తన పనిని తన బాస్ నిర్ణయిస్తారన్నారు.