అబ్బే నాకేం కాలేదు, అనారోగ్య పుకార్లపై అమిత్ షా, ఫేక్ పోస్ట్ చేసినవారి అరెస్ట్..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం బాగోలేదని పుకార్లు షికార్లు చేశాయి. అనారోగ్యానికి గురయ్యారని.. సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. తాను బాగున్నానని.. ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని చెప్పారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో హోం మంత్రి అమిత్ షా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో షా ఆరోగ్యం బాగోలేదని ఊహాగానాలు వినిపించాయి. దీంతో అమిత్ షా ట్వీట్ చేశారు. తాను అనారోగ్యానికి గురయ్యానని తెలిసి, ఆరోగ్యంపై శ్రద్ద వహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఊహాగానాలను విశ్వసించొద్దని కోరారు. ట్వీట్ చేసిన ఇద్దరిని గుజరాత్ పోలీసులు పట్టుకొన్నారు. గంటలోపే ఫేక్ పోస్ట్ చేసిన వారిని స్టేషన్ తీసుకొచ్చారు. భావ్నగర్, అహ్మదాబాద్కు చెందిన వారు పోస్ట్ చేశారని పోలీసులు తెలిపారు.
అమిత్ షా అనారోగ్యానికి గురయ్యారని పోస్ట్ చూసి... కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తొలుత స్పందించారు. ఒకవేళ అనారోగ్యానికి గురైతే కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ పుకార్లకు త్వరలో తెరపడాలని ఆకాంక్షిస్తున్నట్టు విత్తమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అమిత్ షా అంటే గిట్టని వారే పుకార్లు క్రియేట్ చేశారని మరోమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మిగతా క్యాబినెట్ మంత్రులు కూడా ట్వీట్ చేశారు.