కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏ పని చెయ్యలేను, తప్పుగా అర్థం చేసుకున్నారు: కర్ణాటక సీఎం!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అండతో తాను అధికారంలో ఉన్నానని చెప్పిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఒక్క రోజులో మాటమార్చారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కుమారస్వామి వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చెయ్యడంతో సోమవారం మాటమార్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తాను అధికారంలో ఉన్నానని, తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని సోమవారం ఢిల్లీలో కుమారస్వామి మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా తాను ఏ పని చెయ్యలేనని కుమారస్వామి అన్నారు.
మంత్రి వర్గం
మంత్రి వర్గం ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని సోమవారం ఢిల్లీలో కుమారస్వామి మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇప్పటికే మంత్రి వర్గం ఏర్పాటు విషయంలో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చామని కుమారస్వామి మీడియాకు చెప్పారు.
కాంగ్రెస్ ఆశీర్వాదం
ఆరు కోట్ల మంది కన్నడిగుల ఆశీర్వాదంతో తాను ముఖ్యమంత్రి పదవిలో లేనని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆశీర్వాదంతో తాను సీఎంగా ఉన్నానని ఆదివారం కుమారస్వామి వ్యాఖ్యలు చెయ్యడంతో దేశ వ్యాప్తంగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది.
ఏ పని చెయ్యలేను
కుమారస్వామి వ్యాఖ్యలతో తీవ్రస్థాయిలో చర్చ జరగడంతో ఆయన ఢిల్లీలో వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించకుండా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని కుమారస్వామి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంగీకారంతో తాము నిర్ణయాలు తీసుకుంటామని కుమారస్వామి అన్నారు.
ఆజాద్ ఇంటిలో చర్చలు
కర్ణాటక మంత్రి వర్గం ఏర్పాటు విషయంలో శనివారం, ఆదివారం ఢిల్లీలో సిద్దరామయ్య, డాక్టర్ జి. పరమేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చలు జరిపినా ఒక్క కొలిక్కిరాలేదు. సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులామ్ నబి ఆజాద్ ఇంటిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.