నమ్మండి: మోడీ మనసులో మాట, నల్ల ధనం పైనా..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో ప్రసంగం మన్ కీ బాత్(మనసులో మాట)లో భాగంగా ఆదివారం నల్లధనం అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రేడియో ప్రసంగంలో తొలుత స్వచ్ఛ భారత్ గురించి ఆయన మాట్లాడారు. స్వచ్ఛ భారత్ నిర్మాణం తమ ప్రధాన అంశమన్నారు.
తమ చర్యతో ప్రస్తుతం ప్రతి వ్యక్తి సమాజం గురించి ఆలోచించే దిశగా పయనిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ నిర్మాణం తమ ప్రధాన అంశమన్నారు. ప్రతి ఒక్కరి ఆలోచనా సరళి మారాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. యువ భారత్ ఏదైనా సాధించగలదని కొనియాడారు. ఏదైనా చేయాలనే తపన యువతలో ఉందన్నారు.
ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు 125 శఆతం పెంచాలన్నారు. స్వచ్ఛ భారత్లో చిన్నారులు కూడా స్వచ్ఛంధంగా పాల్గొన్నారని, పరిశుభ్ర భారత్ను ప్రజలు ప్రారంభించారని చెప్పారు. స్వచ్ఛ భారత్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం శుభ పరిణామని మోడీ అన్నారు.
మురికిరహతి భారతావని నిర్మాణం దిశగా సాగడం మంచిదన్నారు. అనారోగ్యం ఉన్న ఇల్లు పేదరికంతో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాలు శుభ్రం చేయడం అంటే పేదలకు సేవ చేసినట్లే అన్నారు. అనారోగ్యం దరి చేరకుండా ఉండాలంటే పరిసరాలు శుభ్రం చేయాలన్నారు.
అనంతరం సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. దీపావళి సందర్భంగా వారితో గడిపిన సందర్బాన్ని నెమరువేసుకున్నారు. దేశ రక్షణకు పాల్పడుతున్న జవాన్లకు తాను మరోసారి సలాం చేస్తున్నానని చెప్పారు. విద్యా సంస్థల్లో మౌలికావసతుల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామన్నారు. ఒక్కో విద్యా సంస్థకు రూ.1 లక్ష చొప్పున ఇస్తామన్నారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఉపకారవేతనం ఇస్తామని చెప్పారు. దేశానికి సేవ చేయడంలో తాము శక్తివంచన లేకుండా పని చేస్తున్నామని చెప్పారు. నల్లధనంపై మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఈ విషయంలో సరైన దిశగానే పయనిస్తోందన్నారు. నల్లధనాన్ని దేశానికి రప్పించడంలో ఏమాత్రం రాజీ పడబోమన్నారు.
ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలపై తనకో లేఖ వచ్చిందని చెప్పారు. దానిపై వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమంలో మాట్లాడుకుందామన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ పైన మాత్రం ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నల్ల ధనం విషయంలో ప్రజల సలహాలు, సూచనలు కోరుతున్నట్లు చెప్పారు.