'ప్రధానమంత్రి పదవికి అర్హుడను, ఆయన మద్దతు నాకే'
లక్నో: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సమాజ్ వాదీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్ మంగళారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి పదవికి తానే అర్హుడినని చెప్పారు.
సమయం వచ్చినప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా తనకే మద్దతు ప్రకటిస్తారని ఆయన తెలిపారు. నరేంద్రమోడీ రాజీనామా చేయాలని, ఎంపీలంతా తననే ప్రధానిగా ఎన్నుకోవాలని అన్నారు.
తనను ప్రధానిని చేస్తే దేశానికి మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుందని, ప్రతి రోజూ దేశం పురోగతి సాధిస్తుందని చెప్పారు. సమాజ్వాదీ పార్టీలో సీనియర్ మంత్రి అయిన అజాం ఖాన్కు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పోస్టర్లు వెలిశాయి.
ఈ పోస్టర్లను చూసిన విలేకరులు మంగళవారం అజాం ఖాన్ను ప్రశ్నించగా 'మీరు నన్ను అవమాన పరుస్తున్నారు. నేను ప్రధాని పదవికి అర్హుడను. అందుకే డిప్యూటీ సీఎం పోస్టర్లను తొలగించమని ఆదేశించాను' అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవిషయం ఏమిటంటే, ములాయంను ప్రధానిగా, రాహుల్ను ఉప ప్రధానిగా ప్రకటిస్తే రాబోయే లోక్సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని ఇటీవల యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అజాం ఖాన్ పై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.