మాల్యా లాగా కాదు, టూర్ ముందే ఫిక్సయింది: కార్తీ చిదంబరం
లండన్ టూర్ కూడా ముందే ఫిక్స్ అయిందని తెలిపాడు. ముందే ఫిక్స్ అయిన టూర్ ను ఎందుకు రద్దు చేసుకోవాలని ఎదురు ప్రశ్నించా
న్యూఢిల్లీ: అవినీతి, లంచం కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న తరుణంలో.. మాజీ ఆర్థికమంత్రి కుమారుడు, కార్తీ చిదంబరం లండన్కు వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మాల్యా లాగే కార్తీ చిదంబరం కూడా విచారణను తప్పించుకోవడానికి, చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడా? అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.
ఇదే ప్రశ్నను లండన్లో ఉన్న కార్తీ చిదంబరం ను అడగ్గా.. తాను తరుచుగా విదేశీ ప్రయాణం చేస్తుంటానని, అందులో భాగంగానే లండన్ టూర్ కూడా ముందే ఫిక్స్ అయిందని తెలిపాడు. ముందే ఫిక్స్ అయిన టూర్ను ఎందుకు రద్దు చేసుకోవాలని ఎదురు ప్రశ్నించాడు.
లండన్ నుంచే భారతీయ మీడియాతో మాట్లాడిన కార్తీ చిదంబరం తనపై వస్తున్న ఆరోపణలకు ఇలా వివరణ ఇచ్చుకున్నాడు. లండన్ టూర్ను రద్దు చేసుకునేందుకు.. తనకు ఎలాంటి కారణం కనిపించలేదని, అలాంటప్పుడు ప్రయాణం ఎందుకు రద్దు చేసుకోవాలని కార్తీ చిదంబరం ప్రశ్నించాడు.
కాగా, అవినీతి, ముడుపుల ఆరోపణలతో కార్తీ చిదంబరం ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో సీబీఐ తనిఖీలు నిర్వహించిన మూడు రోజులకే.. ఆయన లండన్ వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
2007లో తన తండ్రి ఆర్థికమంత్రిగా పనిచేసినప్పుడు, ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంద్రాణి, పీటర్ ముఖర్జియా కంపెనీలకు కార్తీ చిదంబరం అనుమతులిచ్చారనే ఆరోపణలున్నాయి. ఇందుకు గాను ఆయనకు భారీ మొత్తంలో ముడుపులు అందాయనేది ప్రధాన అభియోగం.
కార్తీ చిదంబరం లండన్ వెళ్లిపోయిన మరుసటిరోజే ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ ఆయనపై కేసు నమోదు చేసింది. నోటీసులు జారీ చేయడానికి అంతా సిద్దమైన తరుణంలో అతను లండన్ వెళ్లిపోవడంతో ఈడీ ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లకుండా ముందస్తు లుకౌట్ నోటీసులు జారీ చేయకపోవడం కూడా గమనార్హం.