ఔట్పై శ్రీనివాసన్ మౌనం, పవార్ హ్యాపీ: వారికి బెట్టింగ్తో సంబంధం
న్యూఢిల్లీ: బీసీసీఐ ఎన్నికల్లో శ్రీనివాసన్ పోటీ చేయవద్దన్న సుప్రీం కోర్టు తీర్పు పైన మాజీ బీసీసీఐ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. శ్రీనివాసన్ బయటకు వెళ్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. మరో బీసీసీఐ మాజీ చీఫ్ ఏసీ ముత్తయ్య మాట్లాడుతూ.. శ్రీనివాసన్ పైన విమర్శలు గుప్పించారు.
తనను ఎవరు కూడా తప్పించవద్దనేది శ్రీనివాసన్ ఉద్దేశ్యమని, సుప్రీం కోర్టు తీర్పు పట్ల అతను చాలా కోపంగా ఉండి ఉంటారని, అతను చాలా గౌరవంగా బీసీసీఐ నుండి తప్పుకొని, బోర్డు సక్రమంగా నడిచేందుకు అస్కారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లలిత్ మోడీ కూడా సుప్రీం తీర్పు పైన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు పైన శ్రీనివాసన్ స్పందించేందుకు నిరాకరించారు. తీర్పు పైన తాను ఇప్పుడే ఏం మాట్లాడనని తెలిపారు. ఇదిలా ఉండగా, బీసీసీఐ విధులు, సవరణలు న్యాయసమీక్షకు అతీతం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
కాగా, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో సుప్రీం కోర్టు గురువారం నాడు తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీనివాసన్కు క్లీన్చిట్ ఇచ్చిన సుప్రీం.. రెండు పదవుల్లో ఉండకూడదని షాకిచ్చింది. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని సూచించింది.
ఐపీఎల్ ఫిక్సింగ్లో శ్రీనివాసన్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అయితే, తమ కమర్షియల్ ఇంట్రెస్ట్ కోసం చూసిన వారు బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనవద్దని తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్ కోసం బీసీసీఐలో సవరణలు చేశారని తెలిపింది.
శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్, రాజస్థాన్ రాయల్స్ కో పార్టనర్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను నిందితులుగా తేల్చింది. వారికి శిక్షను కొత్తగా ఏర్పడనున్న ప్యానెల్ నిర్ణయిస్తుందని తెలిపింది. అలాగే, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భవిష్యత్తును కూడా ప్యానెల్ నిర్ణయిస్తుందని పేర్కొంది.