సర్! నేను అమాయకుడిని: జడ్జికి లాలూప్రసాద్ మొర
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష పడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం తాను అమాయకుడినని న్యాయమూర్తితో చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బిర్సా ముండా జైలులో ఉన్న లాలూను సిబిఐ కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. ఈ సమయంలో న్యాయమూర్తితో లాలూ ప్రసాద్... 'సర్! నేను అమాయకుడిని. తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు' అంటూ మొరపెట్టుకున్నారు.
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీ సిబిఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. లాలూకు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ఆర్జెడి చెప్పింది.
దాణా కుంభకోణం లాలూ ప్రసాద్ యాదవ్ను రాంచీ సిబిఐ కోర్టు నాలుగు రోజుల క్రితం దోషిగా నిర్ధారించింది. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35 కోట్ల రూపాయలు కాజేశారనే అభియోగంపై సిబిఐ విచారణ చేపట్టింది. పదహారేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతోంది. ఇప్పుడు న్యాయస్థానం లాలూతో పాటు పలువురిని దోషులుగా నిర్ధారించింది.
కోర్టు దోషిగా తేల్చినందున లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కుంభకోణం బయటకు రావడంతో లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఇప్పుడు దోషిగా నిర్ధారణ కావడంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోవాల్సి రావొచ్చు. దాణా కుంభకోణం కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా.
రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో ఇతను రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మొత్తం 61 కేసులు నమోదు కాగా 41 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. కేసుకు సంబంధించి 56 మందిపై కేసు నమోదు కాగా విచారణ కాలంలో 7గురు మృతి చెందారు. లాలూ సహా 45 మందిని కోర్టు ఇటీవల దోషులుగా నిర్ధారించింది.