నేను అమాయకుడ్ని, వేటకే వెళ్లలేదు: కోర్టులో సల్మాన్ ఖాన్
కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం జోధ్పూర్ కోర్టుకు హాజరయ్యారు. 19ఏళ్ళ నాటి ఈ కేసులో సల్మాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
జోధ్పూర్: కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుక్రవారం జోధ్పూర్ కోర్టుకు హాజరయ్యారు. 19ఏళ్ళ నాటి ఈ కేసులో సల్మాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తాను నిర్దోషినని, తనమీద తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్ తెలిపారు.
తానసలు వేటకే వెళ్లలేదని, భద్రతా కారణాల వల్ల షూటింగ్ తర్వాత నేరుగా హోటల్కే వచ్చి గదిలో విశ్రాంతి తీసుకున్నానని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా 25 మంది సాక్ష్యాల ఆధారంగా రూపొందించిన మొత్తం 65 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
అటవీ శాఖ అధికారులు కుమ్మక్కై పబ్లిసిటీ కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్ పేర్కొన్నారు. సల్మాన్తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలిబింద్రే, టబులు కూడా ఈ కేసులో సహనిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారణ జనవరి 25నే జరగాల్సి ఉండగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రత దృష్ట్యా కేసును శుక్రవారానికి వాయిదా వేశారు.
1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం చిత్రీకరణ సమయంలో సల్మాన్ఖాన్ స్నేహితులతో కలిసి కృష్ణజింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. ఇదే సందర్భంలో అక్రమ ఆయుధాలు కలిగిఉన్నారన్న మరో కేసు కూడా సల్మాన్పై నమోదవగా అందులో ఆయన నిర్దోషని గతవారం కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.