లవ్ జీహాద్ కేసు: ‘నేను ముస్లింని.. అలాగే ఉంటా..’, హదియా సంచలన అఫిడవిట్!
న్యూఢిల్లీ: 'నేను ముస్లింని.. ముస్లింగానే ఉండాలని అనుకుంటున్నాను..' ఇవి లవ్ జీహాద్ కేసులో హదియా అలియాస్ అఖిల అశోకన్ మాటలు. మంగళవారం ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. అంతేకాదు, తనను ఇస్లాం మతంలోకి మార్చి పెళ్లాడిన షఫీ జహాన్తోనే కలిసి జీవించాలనుకుంటున్నానని పేర్కొంది.
కేరళ వివాదాస్పద 'లవ్ జీహాద్' కేసు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రాగా 25 ఏళ్ల హదియా ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. వీరి పెళ్లి 'లవ్ జీహాద్' ఘటనేనంటూ.. హదియా-షఫీ జహాన్ల వివాహం చెల్లదంటూ గత ఏడాది మే నెలలో హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ తీర్పుపై హదియా అలియాస్ అఖిల అశోకన్ను పెళ్లాడిన షఫీ జహాన్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీంతో ఈ వివాదంపై విచారణ జరపాలంటూ సుప్రీకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను ఆదేశించింది. గత ఏడాది నవంబర్లో సర్వోన్నత న్యాయస్థానం హదియాకు ఆమె తల్లిదండ్రుల కస్టడీ నుంచి విముక్తి కల్పించింది.
తదుపరి చదువుల కోసం హదియాను సుప్రీంకోర్టు కాలేజీకి పంపించింది. అంతకుముందు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ ముందు హాజరైన హదియా.. తన వివాహం విషయంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని సాక్ష్యమిచ్చింది. తాను ఇష్టపూర్వకంగానే షఫీ జహాన్ను పెళ్లాడినట్లు పేర్కొంది. భర్తతో కలిసి ఉండేందుకు తనను అనుమతించాలని కోరింది.
హదియా మంగళవారం కూడా సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో ఇదే కోరికను వ్యక్తపరిచింది. తాను ముస్లింనే అని, ముస్లింగానే జీవించాలని భావిస్తున్నానని, తనను వివాహం చేసుకున్న షఫీ జహాన్తో కలిసి జీవించేలా అనుమతించాలని అభ్యర్థించింది.