మోడీ అభిమానిని, ప్రచారం అవసరం లేదు: ప్రీతిజింటా
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అంటే తనకు అభిమానమని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతిజింటా అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోడీ ఘన విజయం సాధిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీకి ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను కేవలం దేవుడి దర్శనానికి వచ్చానని చెప్పారు.
పలువురు బాలీవుడ్ ప్రముఖులు నరేంద్ర మోడీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయనకు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. ఇటీవల మోడీ విషయంలో బాలీవుడ్లో విభేదాలు కనిపించాయి.
లౌకికవాదానికి మద్దతివ్వాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇటీవల ఓటర్లను కోరారు. దీంతో మోడీకి మద్దతిచ్చే మరికొందరు బయటకు వచ్చి... లౌకికవాదం పేరుతో కొందరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ మోడీకే తమ మద్దతు అని ప్రకటించారు.
మోడీకి బాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పలువురు మద్దతు పలికిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజశేఖర్ వంటి వారు మద్దతు పలికారు. ఇక నాగార్జున ఆయనను గుజరాత్ వెళ్లి కలిసి వచ్చారు.