గవర్నర్ వర్సెస్ సర్కార్: రబ్బరు స్టాంపుననుకుంటున్నారా?
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోన్న రాష్ట్రాల్లో క్రమంగా రాజ్యాంగపరమైన విభేదాలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యతిరేకిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. గవర్నర్లు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆ రాష్ట్ర గవర్నర్ తప్పు పడుతున్నారు. అదే జాబితాలో కేరళ గవర్నర్ కూడా చేరిపోయారు.
సుప్రీంలో పిటీషన్ వేయడాన్ని తప్పు పట్టిన గవర్నర్..
పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ను దాఖలు చేసింది. ఈ చట్టం అమలు కాకుండా ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ చర్యను ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తప్పు పడుతున్నారు. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా ఓ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా ఎలా నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆయన మండిపడుతున్నారు.
రబ్బరు స్టాంపుననుకోవద్దు..
ఓ రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించే వ్యక్తి.. రబ్బరు స్టాంపు కాదనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని ఆయన హితబోధ చేశారు. గవర్నర్ రాజ్యాంగానికి ప్రతినిధిగా ఉండే వ్యక్తి అని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా, పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఓ చట్టానికి న్యాయపరమైన ప్రతిబంధకాలను సృష్టించే హక్కు గానీ, అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టం అమలును నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడానికి ముందుగా.. గవర్నర్ అనుమతి తీసుకోవాలనే కనీస పరిజ్ఙానం లేకుండా పాలన సాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఉన్నప్పటికీ..
సుప్రీంకోర్టులో పిటీషన్లను దాఖలు చేయడాన్ని తాను తప్పు పట్టబోనని, ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను వ్యతిరేకించే విషయంలో గవర్నర్ అనుమతి తప్పినసరి అనే విషయాన్ని తాను గుర్తు చేస్తున్నానని అన్నారు. సాధారణ అంశాలతో పాటుగా పౌరసత్వ సవరణ చట్టాన్ని కలిపి చూడాలనుకోవడం సరికాదని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రొటోకాల్ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా కనిపించట్లేదని అన్నారు.