పన్నీర్ సెల్వందే తుది నిర్ణయం: నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా నాయకుడు!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు విలీనం కావడానికి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని, ఇవన్నీ పుకార్లు అని తమిళనాడు మాజీ మంత్రి, పన్నీర్ సెల్వం వర్గంలోని ప్రముఖ నాయకుడు కేపీ. మునిసామి స్పష్టం చేశారు. తన మీద కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పన్నీర్, పళనిసామి చర్చలు విఫలం: ఈ డిమాండ్లకు క్లారిటీ లేదు, పన్నీర్ పట్టుతో సీఎంకు?
శనివారం మద్యాహ్నం చెన్నైలో కేపీ. మునిసామి పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడారు. శుక్రవారం రాత్రి పళనిసామి వర్గంతో పన్నీర్ సెల్వం, తాము చర్చించామని ఇదే సమయంలో గుర్తు చేశారు. అన్నాడీఎంకే పార్టీ విలీనం చర్చల విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
పన్నీర్ దే తుది నిర్ణయం
అన్నాడీఎంకే పార్టీ విలీనం విషయంలో మా నాయకుడు పన్నీర్ సెల్వం తుది నిర్ణయం తీసుకుంటారని, ఆయన నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని వివరించారు. అంతే కాని పళనిసామి వర్గంతో కలవకుండా తాను అడ్డుకోలేదని కేపీ. మునిసామి క్లారిటీ ఇచ్చారు.
పోలీసులు రోడ్డు బ్లాక్ చేశారు
శుక్రవారం రాత్రి పన్నీర్ సెల్వం, పళనిసామి మెరీనా బీచ్ దగ్గరకు కలిసి వస్తారని, తాము కలిసిపోయామని అమ్మ సమాధి సాక్షిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. పోలీసులు సైతం అక్కడ రోడ్డు బ్లాక్ చేశారు. శనివారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో సీన్ రివర్స్ అయ్యింది..
సీన్ రివర్స్ అయ్యింది
పళనిసామి, పన్నీర్ సెల్వం మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు రావడం లేదని, చర్చలు విఫలం అయ్యాయని తెలుసుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం వేకువ జామున వరకు అమ్మ సమాధి దగ్గర వేచి ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆయనే అడ్డుకున్నారు
పన్నీర్ సెల్వం వర్గంలోని మాజీ మంత్రి కేపీ. మునిసామి అడ్డుకోవడం వలనే చర్చలు విఫలయం అయ్యాయని పళనిసామి వర్గీయులు ఆరోపించారు. కేపీ. మునిసామిని కాదని పన్నీర్ సెల్వం సైతం ఓ నిర్ణయం తీసుకోలేకపోయారని జోరుగా ప్రచారం జరిగింది.
తుది నిర్ణయం
ఈ సందర్బంలో కేపీ మునిసామి శనివారం మీడియా ముందు వివరణ ఇచ్చారు. మా నాయకుడు పన్నీర్ సెల్వం, ఆయన్ను మేము ఎందుకు అడ్డుకుంటాం అని ప్రశ్నించారు. తమిళనాడు ప్రజలకు మంచి చెయ్యడానికి పన్నీర్ సెల్వం తగిన తుది నిర్ణయం తీసుకుంటారని కేపీ. మునిసామి తెలిపారు.