నేను తెలుగు మహిళను కాను..తెలుగు ఒక్క ముక్క కూడా రాదు: ముఖ్యమంత్రి సతీమణి
బెంగళూరు: తెలుగు మహిళ అని ఆమెకు గుర్తింపు ఉంది. స్వరాష్ట్రం వారిని వదిలేసి, తెలుగు వారి కోసం కృషి చేస్తారనే అపవాదు కూడా ఉంది. తన భార్య తెలుగు కుటుంబం నుంచి వచ్చారని స్వయానా ఆమె భర్తే వెల్లడించారు. ఆ భర్త మామూలు వ్యక్తి అయివుంటే పెద్దగా పట్టింపు ఉండేది కాదేమో. ఆయన స్వయానా ముఖ్యమంత్రి. ఆయనే కుమారస్వామి. కర్ణాటక ముఖ్యమంత్రి. ఆయన భార్య అనితా కుమారస్వామి. జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే. రామనగర నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
తెలుగువారి బాగు కోసమే పని చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దీనిపై అనితా కుమారస్వామి ఎట్టకేలకు స్పందించారు. తాను తెలుగు మహిళను కానని, కన్నడిగురాలినని చెప్పారు. మాట్లాడటానికి తనకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదని చెప్పుకొచ్చారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఆమె కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. కొద్దిరోజులుగా తన ప్రాంతీయతపై వస్తున్న విమర్శలకు తెరదించారు.
అనితా కుమారస్వామి తల్లిదండ్రులది కోలార్. ఆమె బంధువర్గం అంతా కోలార్, చిక్ బళ్లాపుర జిల్లాల్లో నివసిస్తున్నారు. ఈ రెండు జిల్లాలు మన రాష్ట్రానికి ఆనుకునే ఉంటాయి. సరిహద్దు జిల్లాలు అవి. ఈ రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కన్నడిగులు అనర్గళంగా తెలుగు మాట్లాడగలరు.
తాను కోలార్ జిల్లా నుంచి వచ్చానని, అయినంత మాత్రాన తాను తెలుగు మహిళను కానని ఆమె చెప్పారు. కుమారస్వామి-అనితల కుమారుడు నిఖిల్ గౌడ. కన్నడ హీరో. ఆయన నటించిన జాగ్వార్ సినిమా తెలుగులో అదే పేరు విడుదలైంది. తాజాగా నిఖిల్ నటించిన సినిమా సీతారామ కల్యాణ. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. కుమారస్వామి తన భార్య ప్రాంతీయత గురించి మాట్లాడారు. సినిమా ప్రమోషన్ కోసం కుమారస్వామి ఈ ప్రకటన చేసి ఉండొచ్చని అనిత చెప్పారు.